ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఆ మొత్తం కట్..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 07:46 PM

ఏపీలో వాలంటీర్ల కొనసాగింపుపై సందిగ్ధత కొనసాగుతున్న నేపథ్యంలో.. టీడీపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ కొనుగోలు కోసం వాలంటీర్లకు ప్రతి నెలా ఇచ్చే రూ.200ల భత్యం నిలిపివేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన పెంచుకునేందుకు, ప్రజలకు వివరించేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాలంటీర్లకు పేపర్ భత్యం అందించేవారు. సర్క్యులేషన్ ఎక్కువగా ఉన్న పేపర్ కొనుగోలు చేసేందుకు గానూ ప్రతి నెలా రూ.200 భత్యాన్ని 2.60 లక్షల మంది వాలంటీర్లకు చెల్లిస్తూ వచ్చారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ రూ.200 భత్యాన్ని నిలిపివేయనున్నట్లు సమాచారం.


మరోవైపు జులై నెల పింఛన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను.. ఏపీ ప్రభుత్వం దూరం పెట్టింది. సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్ పంపిణి చేయాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రి కొలుసు పార్థసారథి ఇదే విషయాన్ని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి పార్థసారథి.. వాలంటీర్ల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మంత్రివర్గం భేటీ తర్వాత కూడా ఎలాంటి ప్రకటనా లేకపోవటంతో ఏపీలోని వాలంటీర్లు ఆందోళన చెందుతున్నారు.


మరోవైపు ఎన్నికల ప్రచార సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే సచివాలయాలు, వాలంటీర్ల శాఖ బాధ్యతలను కూడా మంత్రి డోల బాలవీరాంజనేయస్వామికి అప్పగించారు. దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై వాలంటీర్లు ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతుగా రాజీనామాలు చేసిన వారు కూడా తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటూ పలుచోట్ల టీడీపీ నేతలను కలుస్తున్నారు. మరికొన్ని చోట్ల వైసీపీ నేతల బలవంతంతోనే రాజీనామాలు చేశారంటూ పోలీస్ స్టేషన్లను సైతం ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com