ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత కక్షలనేపథ్యంలో కత్తితో దాడి, చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 11:43 AM

 పాతగొడవలు మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిపై భార్యభర్తలు పైపుల రెంచ్‌, చీపుర్లు కోసే చాకుతో దాడి చేసి గాయపర్చారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి హౌసింగ్‌కాలనీ జీఎఫ్‌-8లో ఆటోడ్రైవర్‌ మద్దా రవికుమార్‌(27) కుటుంబంతో ఉంటున్నాడు. అదే బ్లాక్‌లో భార్యభర్తలు కిరణ్‌కుమార్‌, భవానీ ఉంటున్నారు. భవానీతో రవికుమార్‌కు అక్రమ సంబంధం ఉందనే వ్యవహాంపై రవికుమార్‌, కిరణ్‌కుమార్‌కు మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఇటీవల పెద్దల సమక్షంలో మాట్లాడుకుని సర్దుబాటు చేసుకున్నారు. 20వ తేదీన రవికుమార్‌ ఇంట్లో లేని సమయంలో అతని తల్లి వద్దకు వచ్చి కిరణ్‌కుమార్‌, భవానీలు గొడవపడ్డారు. రవికుమార్‌ భార్య ఈవిషయాన్ని అతనికి ఫోన్‌లో చెప్పింది. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆటోలో ఇంటికి వస్తున్న రవికుమార్‌ను కిరణ్‌కుమార్‌, అతని భార్య కాలనీ సమీపంలో సప్తగిరి బ్యాంక్‌ వద్ద అడ్డగించి గొడవపడ్డారు. తమతో తెచ్చుకున్న పైపుల రెంచ్‌తో తలపై కొట్టి చీపుర్లు కోసే చాకుతో దాడి చేసి గాయపర్చారు. గాయాలవడంతో రవికుమార్‌ కేకలు పెట్టాడు. దీంతో స్థానికులు వచ్చారు. దీంతో కిరణ్‌కుమార్‌, భవానీ పరారయ్యారు. రవికుమార్‌ను ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందాడు. పోలీసులు భార్యాభర్తలపై హత్య కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com