ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. 36 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 09:42 PM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాపట్ల హత్యాచార ఘటన కేసును పోలీసులు ఛేదించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. 36 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ వివరాలను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈ కేసులో దేవరకొండ విజయ్, కారంకి మహేష్, దేవరకొండ శ్రీకాంత్ అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఓడరేవుకు వెళ్లే రోడ్డులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు బాపట్ల ఎస్పీ వెల్లడించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈపురుపాలెం గ్రామంలోని సీతారాంపురానికి చెందిన 21 ఏళ్ల యువతి బహిర్భూమి కోసం వెళ్లి హత్యాచారానికి గురైంది. జూన్ 21వ తేదీ శుక్రవారం ఉదయం సుమారు 5:45 నిమిషాల సమయంలో ఇంటికి దగ్గరలో ఉన్న రైలుపట్టాలపైకి బహిర్భూమి కోసం వెళ్లిన యువతి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు గాలించగా.. రైలు పట్టాల సమీపంలో మృతదేహం లభించింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు యువతిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. అత్యాచారం చేసి హత్యచేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు


పోలీసుల దర్యాప్తులో దేవరకొండ విజయ్, కారంకి మహేష్ అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. జూన్ 21వ తేదీ ఉదయం రైల్వే ట్రాక్ సమీపంలో బహిర్భూమి కోసం వెళ్లిన యువతిని.. బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లిన యువకులు.. అఘాయిత్యానికి ఒడిగట్టారు. అనంతరం ముఖంపై దాడి చేసి హత్య చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లుగా స్థానికులతో పాటుగా మరోసారి అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత దేవరకొండ శ్రీకాంత్‌ సహకారంతో చీరాలలోని ఓ ప్రైవేటు లాడ్జిలో ఉన్నారు.


అయితే ఘటన జరగడానికి ముందు ఆ ప్రాంతానికి విజయ్, మహేష్ రావడాన్ని స్థానికులు గమనించారు. దీంతో పోలీసులకు వీరిపై అనుమానం కలిగింది. శ్రీకాంత్ ఫోన్ ఆధారంగా వీరి కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు.. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించగా సీఎం చంద్రబాబు నేరుగా స్పందించారు. హోం మంత్రి వంగలపూడి అనితను ఘటనాస్థలికి వెళ్లి.. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించారు. దీంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి ప్రభుత్వం తరుఫున రూ.10 లక్షలు పరిహారం కూడా అందించారు.


ముఖ్యమంత్రి నేరుగా ఫోకస్ పెట్టడంతో పది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే వివిధ కోణాలలో దర్యాప్తు చేసి 36 గంటలలోపు నిందితులను అరెస్టు చేశారు. దీంతో పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత సైతం పోలీసులను అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com