ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా మాట జవదాటితే.. మంత్రి అచ్చెన్న వివాదాస్పద వ్యాఖ్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 07:35 PM

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆవేశంలో, కార్యకర్తలను ఉత్సాహపరిచే క్రమంలో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఐదేళ్లలో కార్యకర్తలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేసుకున్న అచ్చెన్న.. వారికి ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ఆవేశంలో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంత్రి అచ్చెన్నాయుడు మంగళవారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన అచ్చెన్నాయుడు కాస్త భావోద్వేగానికి గురయ్యారు. 2019 -24 మధ్య వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని అచ్చెన్న ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ తప్ప మరో పార్టీ ఉండకూడదనేలా వ్యవహరించారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇన్ని బాధలు పడలేదన్న అచ్చెన్నాయుడు.. అసలు టీడీపీ పార్టీ ఉంటుందా లేదా అని నిద్రలేని రాత్రులు గడిపినట్లు చెప్పుకొచ్చారు. అయితే కష్టకాలం నుంచి తేరుకుని టీడీపీ కూటమి అద్భుత విజయం సాధించిందని చెప్పారు.


రాష్ట్రాభివృద్ధి గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్న మంత్రి.. ఐదునెలల్లో రాష్ట్రాన్ని గాడినపెడతామన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై నమ్మకంతో నాలుగు శాఖలు ఇచ్చారన్న అచ్చెన్న.. నా జీవితం శ్రీకాకుళం జిల్లాకు, చంద్రబాబు కుటుంబానికి అంకితమని భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రతి కార్యకర్తకు మాట ఇస్తున్నానని.. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలనే రకంగా పనిచేస్తానని ఎమోషనల్ అయ్యారు.


"ఐదు సంవత్సరాలు అవస్థలు పడ్డారు, ఐదేళ్లు అవమానాలు పడ్డారు. నేను మాటిస్తున్నా. రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను. రేపటి నుంచి ప్రతి కార్యకర్త.. ఎమ్మార్వో ఆపీసుకు వెళ్లినా, ఎస్సై దగ్గరకు వెళ్లినా, ఎండీవో దగ్గరకు వెళ్లినా.. ఏ ఆఫీసుకు వెళ్లినా పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి. మీకు గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి మీ పని ఏంటని అడిగి.. మీ పని చేసే విధంగా అధికారులను లైన్లో పెడతారు. ఎవరైనా ఒకరో ఇద్దరో అధికారులు మాట జవదాటితే వారు ఏమవుతారో వారికి చెప్పాల్సిన అవసరం లేదు." అని అచ్చెన్నాయుడు మాట్లాడారు. ప్రస్తుతం అచ్చెన్న మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com