ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవన్నీ వట్టి వదంతులే.. నమ్మొద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 18, 2024, 07:32 PM

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. స్వామి వారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. సామాన్య జనం నుంచి వీవీఐపీల వరకూ అందరూ ఆ శ్రీవారి కృపకు పాత్రులు కావాలని తపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే భక్తుల సౌకర్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చర్యలు తీసుకుంటోంది. భక్తులను ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు దివ్యాంగులకు, వృద్ధులకు ప్రత్యేక దర్శనాలను సైతం కల్పిస్తోంది. అయితే ఈ దర్శనాల గురించి సోషల్ మీడియాలో ఏవో ఒక వదంతులు వ్యాపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే వయోవృద్ధుల ప్రత్యేక దర్శనం గురించి కూడా రూమర్లు వ్యాపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం దీనిపై క్లారిటీ ఇచ్చింది. వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్ కోటా టికెట్లను మూడు నెలలకు ఓసారి విడుదల చేస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వదంతులను నమ్మవద్దని.. అవన్నీ అబద్ధాలని స్పష్టం చేసింది. వేయిమంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టోకెన్లను ప్రతి నెలా 23 మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ప్రస్తుతం 2024 ఆగస్ట్ వరకూ వయోవృద్ధుల ఆన్ లైన్ కోటా టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపింది.


మరోవైపు వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు యాభై రూపాయల విలువైన ఒక లడ్డూను ఉచితంగా అందజేస్తున్నట్లు వివరించింది. ఈ కోటా భక్తులను తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్, పిహెచ్‌సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని టీటీడీ సూచించింది. మరిన్ని వివరాలకు టీటీడీ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com