ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిప్పుల కురిపిస్తోన్న భానుడు.. లోక్‌సభ ఎన్నికలు, రైల్వేలకు ఐఎండీ ప్రత్యేక హెచ్చరిక

national |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 10:25 PM

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నడూలేని విధంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. మరోవైపు, దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి లోక్‌సభ ఎన్నికల కోసం భారత వాతావరణం విభాగం (ఐఎండీ) కీలక సూచనలు చేసింది. విద్యా సంస్థలకు వేసవి సెలవుల కారణంగా రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇతర సిబ్బంది ఎన్నికల విధులు, భద్రత కోసం సుదూర ప్రయాణాలు చేస్తుంటారు. దీంతో రైలు ప్రయాణాల విషయంలో హెచ్చరికలు వెలువరించింది.


ఏప్రిల్- జూన్ మధ్య వేసవిలో వేడి తీవ్రంగా ఉంటుంది, దేశంలోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 22 రోజుల పాటు వడగాల్పులు కొనసాగుతాయని ఏప్రిల్ 1న ఐఎండీ హెచ్చరించింది. దీని ప్రకారం ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, రాజస్థాన్‌లో గత మూడు వారాల నుంచి వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలాగే, దేశంలోని మిగతా ప్రాంతాల్లో మే నెల మధ్య నాటికి ఉష్ణోగ్రతలు అత్యంత గరిష్ట స్థాయికి చేరుకుంటాయి.


ఐఎండీ హెచ్చరికలతో వడగాల్పులను ఎదుర్కొడానికి సన్నద్ధతపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 11న అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐఎ:డీ, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు హాజరయ్యారు. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 న జరిగే మిగిలిన దశల పోలింగ్‌కు ఐఎండీ సూచనలు చేయనుంది.


ప్రత్యేకంగా రూపొందించిన ఇంటరాక్టివ్ మ్యాప్‌లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు, తేమ స్థాయిలు, ప్రాంతాల వారీగా హీట్‌వేవ్ పరిస్థితులు మొదలైన వాటిపై సమాచారాన్ని అందిస్తుంది. ఐదు రోజుల ముందు ఒక ప్రాంతంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల ఆధారంగా సూచనలు చేస్తుంది. ఈ సమాచారంతో సంబంధిత ప్రాంతంలో పోలింగ్ రోజున వడగాల్పుల నుంచి రక్షణకు చర్యలు తీసుకోడానికి ఉపయోగపడుతుందని ఐఎండీ వ్యాఖ్యానించింది. మానవ ఆరోగ్యానికి సంబంధించిన కీలక కారకాలైన రాత్రిపూట పరిస్థితులు, గాలి వేగం, వేడి, తేమ వంటి వివరాలను కూడా అందిస్తోంది.


నాలుగు, ఐదు దశల పోలింగ్ జరిగే సమయానికి దేశంలో ఉష్ణోగ్రతలు మే మూడో వారంలో గరిష్టానికి చేరుకుంటాయని అంచనా. ముఖ్యంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వేడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రాష్ట్రాల్లో పోలింగ్ నాలుగో దశలోనే జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com