ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గర్భిణీకి చికిత్సను నిరాకరించిన డాక్టర్.. ఆయన చూపిన కారణంపై నెట్టింట ఆసక్తికర చర్చ

national |  Suryaa Desk  | Published : Wed, Apr 24, 2024, 10:23 PM

చికిత్సకు సంబంధించిన వైద్యుల ప్రణాళికలను రోగులు నిర్దేశించే పరిస్థితుల్లో వైద్యాన్ని నిరాకరించవచ్చని గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఓ గైనకాలజిస్ట్ అంటున్నారు. ఈ కారణాన్ని చూపి ఓ 30 ఏళ్ల గర్బిణీకి ఆయన చికిత్స నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. తాను సూచించిన అవసరమైన పరీక్షలు చేయించుకోడానికి నిరాకరించడంతో ఆమెకు చికిత్సను తిస్కరించానంటూ రాజేశ్ పారిఖ్ అనే స్త్రీ, ప్రసూతి వైద్య నిపుణుడు ‘ఎక్స్‌’లో పోస్ట్ పెట్టారు.


రోగులు తమ వైద్యులను ఎంచుకునే హక్కు ఉన్నట్టుగానే.. అత్యవసర పరిస్థితుల్లో మినహా పేషెంట్లకు చికిత్సను తిరస్కరించే హక్కు డాక్టర్లకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించుకోనందున ఒక రోగికి చికిత్స అందించలేదని చెప్పారు.


ఆమె వైద్య సలహాను విస్మరించారని, వైద్యరంగంతో ఏ మాత్రం సంబంధంలేని తన స్నేహితుల సలహా విని ఎన్‌టీ స్కానింగ్, డబుల్ మార్కర్ పరీక్ష (క్రోమోజోమ్ లోపాలను నిర్ధారించే పరీక్ష) చేయించుకోలేదని తెలిపారు. వైద్యం చేయాలంటూ ఆమె పలుమార్లు కోరినప్పటికీ, మరో వైద్యుడిని వెతుక్కోవాలని సలహా ఇచ్చానని రాజేశ్ పారిఖ్ వెల్లడించారు. గైనకాలజిస్ట్ రాజేశ్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఒక డాక్టర్‌గా, ప్రత్యేకించి గైనకాలజిస్టుగా పెషెంట్‌కి ఎప్పుడూ చికిత్స నిరాకరించకూడదని, న్యాయస్థానంలో తదుపరి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.


క్లినిక్‌ల నుంచి కమీషన్ల కోసమే ఈ పరీక్షలను ఆయన సూచించినట్టు తాను భావిస్తున్నానని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు మాత్రం వైద్యుడ్ని సమర్థిస్తూ.. అవసరమైతేనే టెస్టులు సూచిస్తారని పేర్కొన్నాడు. కాగా డబుల్ మార్కర్ టెస్ట్ చాలా ఖరీదైనదని, డాక్టర్లు అధిక కమీషన్లు కోసం దీనిని రాస్తుంటారని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. తాను రోగిని పూర్తిగా నిందించలేనని, వైద్య రంగం కోల్పోయిన విశ్వాసానికి ఆయన ఎలా బాధ్యత వహిస్తారని ప్రశ్నించాడు.


అయితే, మరో యూజర్ మాత్రం వైద్యుడిని సమర్థించారు. ధైర్యంగా వైద్యాన్ని తిరస్కరించారని, పరీక్షలు చేసుకోడానికి అంగీకరించని మహిళకు ‘డౌన్ సిండ్రోమ్’ లోపంతో బిడ్డ పుడితే న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని, కోర్టులు విధించే ఆర్థిక జరిమానాలు మిమ్మల్ని దివాలా తీయించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నాడు. ‘ఇది నియమం అని నేను అంగీకరిస్తున్నాను. అలాగే ప్రత్యేకించి నిర్దిష్ట రోగి ఏదైనా చికిత్స లేదా ఆసుపత్రిలో చేరడానికి నిరాకరించిన వాస్తవం సహా జరిగే ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేయాలి.. ఇది భవిష్యత్తులో ఏవైనా సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది’ అని మరో నెటిజన్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com