నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానననేది రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని.. అది ఎంపీ గానా లేక ఎమ్మెల్యేగానా అనేది త్వరలో చెబుతానన్నారు. నామినేషన్ మాత్రం ఈనెల 22న వేస్తానని స్పష్టం చేశారు. మినేషన్ సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. ఉండి మండలం వెలివర్రు లోని వీర పేరంటాలమ్మ అమ్మ వారిని దర్శించుకున్నానని.. ఈ ప్రాంతానికి వచ్చినపుడు అమ్మ వారి ఆశీర్వాదం తీసుకోవడం తనకు సెంటిమెంట్ అన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్య మంత్రి కావాలని జగన్ ఓడిపోవాలని కోరుకున్నట్లు తెలిపారు.
గతంలో తాను ఎంపీగా ఎన్నికైన తరువాత అమ్మవారి ఆలయానికి విచ్చేసి మొక్కలను నాటానని ఈ ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతుందన్నారు. సీఎం వస్తున్నా రంటే ఆ ప్రాంతంలో ఉన్న పచ్చని చెట్లను అధికారులు నిర్దాక్షి ణ్యంగా నరికేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మరో సానుభూతి నాటకానికి సీఎం జగన్మోహన్రెడ్డి తెర తీశారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. జగన్పై రాయి దాడి ఘటన వెనుక ఎన్నో సందేహాలున్నాయన్నారు యాత్ర సాఫీగా సాగుతున్న దశలో విద్యుత్తు ఎందుకు ఆగిపోయింది?.. ఆ క్షణంలో ఓ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ఎందుకు నిలిచింది? భద్రతా వలయం ఏమైనట్లు? ఘటన జరిగిన వెంటనే పంగలకర్ర ఉపయోగించినట్లు ఎలా చెప్పారు అని ప్రశ్నించారు.
సానుభూతి కోసం జరిగిన ముందస్తు నాటకంపై వారు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అయినా జగన్మోహన్రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? ఎన్నికల సర్వేలు వ్యతిరేకంగా రావడం, వైఎస్సార్సీపీ సభలు, సమావేశాలకు జనం రాకపోవడంతో సానుభూతి కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కోడికత్తి డ్రామా కథ ఇంకా సాగుతూనే ఉందని.. వివేకా హత్య వ్యవహారంలో కడపలో మొదలైన వ్యతిరేక పవనాలు రాష్ట్రమంతటా వీయడంతో స్వయంగా ఆయనే సానుభూతి కోసం ఇలాంటివి చేయించుకున్నారనే అనుమానాలున్నాయి. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తికి ఇలా జరగడం, జనాలు లేని ప్రాంతం చూసి గజమాలను ఏర్పాటు చేయడం, దాని వెనుకే రాయి తగలడం అంతా సినీ ఫక్కీలో ఉందన్నారు. రాళ్లు విసిరితే కేవలం సీఎం జగన్కు, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లికి మాత్రమే గాయాలవడం వెనుక మర్మమేంటో అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యే రామరాజుకు అనుకూలంగా ఉండిలో దీక్ష చేస్తున్న వారిని బెట్టింగ్ వాళ్లు అని అన్న మాటను తాను వెనక్కి తీసుకుంటున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఒకవేళ ఎప్పుడైనా మూడు రోజులు దీక్ష చేయాల్సి వస్తే వారి సలహా తప్పకుండా తీసుకుంటాను అన్నారు.