ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా వైసీపీ నేతలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ పలుమార్లు ఏపీ ఎన్నికల సంఘం దృషికి తీసుకెళ్లింది. ఈ విషయంపై ఏపీ ఎన్నికల అధికారులకు పలుమార్లు టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన తూతూమంత్రపు చర్యలను మాత్రమే తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలపై అధికార వైసీపీ దాడులకు ఉసిగోల్పుతోందని.. ఇలాంటి దాడులు ఏపీలో రోజురోజుకూ పెరిగి పోతున్నాయని టీడీపీ నేతలు మరోసారి కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం నాడు ఫిర్యాదు చేశారు. పులివెందుల అసెంబ్లీపై ప్రత్యేక దృష్టిసారించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర లేఖ రాశారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని ఈసీఐ ఆదేశించినా కొంతమంది అధికారులు మాత్రం అధికార పార్టీ ఒత్తిడితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో జగన్ రెడ్డిపై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి భద్రత లేదని అన్నారు. ఈ నియోజకవర్గంలో తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ గతంలోనే ఈసీఐకి తాము లేఖ రాశామని గుర్తు చేశారు.