టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. పార్టీకి చెందిన ముఖ్యనేత గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నూమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పల్నాడు జిల్లాకు చెందిన బీసీ నేత గుంటుపల్లి నాగేశ్వరరావు టీడీపీలో చాలా కీలకంగా ఉన్నారు. టీడీపీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులుగా ఉన్నారు. గతంలో రెండుసార్లు నాయి బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్గానూ పని చేశారు. గురజాల నియోజకవర్గంలో బలమైన బీసీ నేతగా గుంటుపల్లి నాగేశ్వరరావు ఎదిగారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే నరసరావుపేటలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం నాడు ఆయన ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు యరపతినేని శ్రీనివాసరావు, నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు.. గుంటుపల్లి మృతదేహాన్ని సందర్శించారు. ఆయన పార్థీవదేహాన్ని దాచేపల్లికి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గుంటుపల్లి నాగేశ్వరరావు మృతితో పల్నాడు టీడీపీ శ్రేణులు విషన్నవదనంలో మునిగిపోయారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు.