ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా పేరును రాజకీయాలకు వాడుకోవద్దు: మోహన్ బాబు వార్నింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2024, 07:14 PM

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. మాజీ ఎంపీ, సినీనటుడు మంచు మోహన్‌ బాబు సంచలన లేఖ విడుదల చేశారు. తన పేరును రాజకీయాలకు వాడుకోవద్దని పార్టీలకు సూచిస్తూనే.. అలాంటి పనిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ విడుదల చేశారు.ఈ మధ్య కాలంలో తన పేరును ఉపయోగించుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్న మోహన్ బాబు.. ఏ పార్టీ వారైనా తన పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. అలాగే మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నామనీ.. ఎవరి అభిప్రాయాలు వారివని చెప్పుకొచ్చారు.


ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయన్న మోహన్ బాబు.. అది వారి వారి వ్యక్తిగతమని లేఖలో పేర్కొన్నారు. చేతనైతే నలుగురికి సాయపడడంలో దృష్టిపెట్టాలి గాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరమని అన్నారు. తనకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తున్నానన్న మోహన్ బాబు.. శాంతి , సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.


మరోవైపు మోహన్ బాబు గతంలో టీడీపీ నుంచి ఎంపీగా పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో మంచు కుటుంబం వైసీపీకి మద్దతు ఇచ్చింది. అలాగే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతోనూ మంచు ఫ్యామిలీకి బంధుత్వం ఉంది. అయితే గత కొంతకాలంగా మోహన్ బాబు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. అయితే ఇటీవల జరిగిన ఓ ప్రెస్‍‌మీట్లో పోసాని కృష్ణమురళి మోహన్ బాబు ప్రస్తావన తీసుకువచ్చారు.


హెరిటేజ్ సంస్థ చంద్రబాబుది కాదన్న పోసాని.. మోహన్ బాబుది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విషయం తనకు తప్ప మిగతావాళ్లకు పెద్దగా తెలియదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబును మోసం చేసి హెరిటేజ్ సంస్థను తీసుకున్నారని.. ఈ విషయం అబద్ధమని అనుకుంటే తనకు నార్కోటెస్ట్ చేయించాలని సవాల్ చేశారు. టెస్టులో అబద్ధమని తేలితే తనను లైవ్‌లోనే చెప్పుతో కొట్టండి అంటూ పోసాని ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాలనే ఆలోచనతోనే మోహన్ బాబు ఈ లేఖ విడుదల చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com