ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు రూ.2500 కోట్లు,,,కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 07:34 PM

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం మరో రూ.2500 కోట్లు కేటాయించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. ముడిపదార్థాల కొరత కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తిని పెంచేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మరో రెండున్నర వేల కోట్లు ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. గురువారమే రూ.500 కోట్లు మంజూరు చేయగా.. వాటితో పాటుగా మరో రెండున్నర వేలకోట్లు ఇవ్వనుంది. అయితే ఇక్కడే కేంద్రం ఓ షరతు పెట్టింది. మొదటగా విడుదల చేసిన నిధులను కేవలం చెల్లింపులకే వాడాలని కండీషన్ పెట్టింది. ఇక దీనికి సంబంధించి నిధుల వినియోగం బాధ్యతలను ఎస్బీఐకు అప్పగించింది. ఇప్పుడు ప్రకటించిన రెండున్నర వేల కోట్లలోనూ ఎస్బీఐకే బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 23 నాటికి ఈ నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ఉక్కుశాఖ హామీ ఇచ్చింది.


మరోవైపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్ ఫర్నేసులు ఉన్నాయి. అయితే ముడిపదార్థాల కొరత తలెత్తటంతో రెండు ఫర్నేసులు ఆపేశారు. కేవలం ఒక దాని నుంచి మాత్రమే ఉక్కు ఉత్పత్తి జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం నిధులు కేటాయించింది. నిధులు అందజేస్తున్న నేపథ్యంలో మరో బ్లాస్ట్ ఫర్నేసును నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని కేంద్రం స్పష్టం చేసింది. నవంబర్ నుంచి రెండు బ్లాస్ట్ ఫర్నేసులలోనూ ఉత్పత్తి ప్రారంభించాలని స్పష్టం చేసింది. అవసరమైన ముడి పదార్థాలను సైతం సరఫరా చేస్తామని కేంద్ర ఉక్కుశాఖ హామీ ఇచ్చింది. మరోవైపు రెండు బ్లాస్టు ఫర్నేసులను మాత్రమే నడపనున్న నేపథ్యంలో.. కొంతమంది సిబ్బందిని ఇతర కేంద్ర సంస్థలకు డిప్యుటేషన్ మీద పంపాలని కేంద్రం నిర్ణయించింది.


మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇంఛార్జ్ సీఎండీ అరుణ్ కాంత్ భగ్నిని కార్మిక సంఘాల నేతలు.. శనివారం కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశం వివరాలను అధికారులు వారితో పంచుకున్నారు. ముడిపదార్థాల కొరతతో మూసివేసిన ఒకటో బ్లాస్ట్ ఫర్నేసును అక్టోబర్ రెండో తేదీలోపు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి నిధులు వస్తాయని కార్మిక సంఘాల నేతలకు వివరించారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంతో చర్చలు జరుపుతోందని కార్మిక సంఘాల నేతలకు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com