మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ను ఖండించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అరెస్టు చేశారని.. జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే ఈ అరెస్ట్ జరిగిందన్నారు. ఏ తప్పు చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని..రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని.. కనీసం తమ నాయకుడికి మద్దతు తెలిపేందుకు టీడీపీ నేతలకు కూడా బయటకు రానివ్వడం లేదన్నారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు పవన్. శాంతిభద్రతలను కాపాడాల్సింది పోలీసులు అని.. అసలు శాంతిభద్రతలకు, వైసీపీకి సంబంధం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంది వైఎస్సార్సీపీ వల్లేనని అన్నారు. గతంలో తన విశాఖ పర్యటన సందర్భంలో కూడా తమపట్ల ఇదేవిధంగా ప్రవర్తించారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.
వైఎస్సార్సీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నించడం తప్పా అని జనసేనాని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, చంద్రబాబు అనుచరులు ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు అక్రమాలు చేయవచ్చు, దోపిడీలు చేయవచ్చు.. జైళ్లలో మగ్గిపోవచ్చు.. విదేశాలకు వెళ్లొచ్చన్నారు. చంద్రబాబుపై పెట్టింది తప్పుడు కేసులేనని.. ఇలాంటి చర్యలను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సింది పోలీసులు కదా?అరాచకాలు జరుగుతున్నది వైఎస్సార్సీపీ వల్లే కదా అన్నారు. చంద్రబాబుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని.. ఆయన త్వరగా బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు.