ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి అంతర్జాతీయ క్రీడాకారిణులను లైంగిక వేధింపులకు గురి చేయడం దారుణమని, వెంటనే అతన్ని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండు చేశారు. గురువారం కడప పాతబ స్టాండు సర్కిల్ లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైదానంలో శిక్షణ తీసుకోవాల్సిన క్రీడాకారిణులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత మూడు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తుంటే దేశానికే అవమానకరమన్నారు.
ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చేయాలన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నాయకులు రాజేంద్ర, సునీల్, దస్తగిరిరెడ్డి, ఓబులేసు, వెంకటసుబ్బయ్య, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.