తన ప్రభుత్వ పనితీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మెగా సర్వే 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మంచి చేసిన వాళ్లనే ప్రజలు నమ్ముతారని ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. 'జగనన్నే మా భవిష్యత్తు' కార్యక్రమం మొదలై 15 రోజులు పూర్తి అయిన సందర్భంగా గురువారం రైల్వే కోడూరు వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేవలం 15 రోజుల్లో 'మా నమ్మకం నువ్వే జగన్-జగనన్నే మా భవిష్యత్' పేరుతో కోటి కుటుంబాలను నేరుగా కలసి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం దేశంలోనే ఒక రికార్డన్నారు. ప్రభుత్వ పనితీరును సమర్థిస్తూ 76 లక్షల మిస్డ్ కాల్స్ రావడం గర్వించదగ్గ విషయంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ధ్వజ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు పాల్గొన్నారు.