ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినాష్ రెడ్డి అరెస్టైతే మేం రాజీనామాలకు సిద్దం: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 08:19 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేసినట్లు నిర్ధారణ అయితే త‌మ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. గతంలో కూడా ఇదే మాట చెప్పానని, ఆ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేసినట్లు నిరూపణ అయితే త‌నతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని గతంలో కూడా చెప్పానన్నారు.


ఈ మేరకు బుధవారం కడప రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డిని కలిసేందుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని ముద్దాయిగా చేసినంత మాత్రాన నేరం చేసినట్లు కాదన్నారు. ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతుందని, నేరస్తుడిగా చెప్తేనే దోషి అయినట్లు అని అన్నారు. అదే జరిగితే తాము పదవుల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ కేసులో ఇక వైఎస్ అవినాష్‌రెడ్డి కచ్చితంగా అరెస్ట్‌ అవుతారని చెప్పారు. ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్టయినా ఆయన బెయిల్‌పై బయటకు వస్తారని పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి సౌమ్యుడని, హత్యలు చేసే మనస్తత్వం ఆయనది కాదన్నారు.


వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీతను ముందు పెట్టి ఎంపీ రఘురామ కృష్ణరాజు, సుజనా చౌదరి చేస్తున్న కుట్రలో భాగమే ఇది అని ఎమ్మెల్యే రాచమల్లు పేర్కొన్నారు. వైఎస్ సునీతపై ప్రొద్దుటూరులో వెలిసిన వాల్‌పోస్టర్లు ఎవరో ఆకతాయిలు వేసి ఉండొచ్చని, లేకపోతే రాజకీయంగా వేసి ఉండొచ్చన్నారు. వీటిపై విచారణ జరగాలన్నారు. బెంగళూరులో ఈ పోస్టల్ ప్రింట్ అయినట్లు తెలుస్తోందని చెప్పారు. సునీత రాజకీయాల్లోకి వచ్చేది లేదు, సచ్చేది లేదని.. వచ్చినా ఇబ్బందేమీ లేదని వ్యాఖ్యానించారు.


వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు చూపించి చంద్రబాబు సంకలు గుద్దుకుంటున్నారని, అరెస్ట్ అయినా 3 నెలలకే‌ బెయిల్ వస్తుందని రాచమల్లు పేర్కొన్నారు. ఈ హత్య పేరు చెప్పి లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని పేర్కొన్నారు. పదేపదే వివేకా హత్య కేసును ప్రతిపక్షాలు ప్రస్తావించి లబ్ధి పొందాలనుకుంటున్నాయని విమర్శించారు.


అయినా, వైఎస్ వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమి ఉంటుదని ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు. సీఎం జగన్ ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మహా కుట్రలో ఇరికించేందుకు ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో వివేక హత్య కేసును ప్రచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమం గురించి మాట్లాడకుండా ఎంతసేపు బాబాయి హత్య, గొడ్డలి అంటూ మాట్లాడుతూ ఉన్నారన్నారు. ఎదుటివారిని దుర్మార్గులను చేసి ఓట్లు అడిగే పార్టీ ఒక పార్టీయేనా.. అలాంటి నాయకుడు, ఒక నాయకుడేనా అని విమర్శించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com