ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం బ్యాక్‌ వాటర్‌పై ఉన్నవంతా అపోహలే: కేంద్రం స్పష్టీకరణ

national |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 11:43 PM

పోలవరం బ్యాక్‌ వాటర్‌పై 3 రాష్ట్రాలకు కేవలం అపోహలు ఉన్నాయని, తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నాలుగు రాష్ట్రాల అధికారులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వర్చువల్‌ సమావేశం ముగిసింది. కేంద్ర జల శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోలవరం బ్యాక్‌ వ్యాటర్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే అధ్యయనం చేయించామని కేంద్రం వెల్లడించింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై 3 రాష్ట్రాలకు కేవలం అపోహలు ఉన్నాయని, తెలంగాణలోని భద్రాచలానికి ఎలాంటి ముంపు సమస్య ఉండదని స్పష్టం చేసింది.


దీనికి సంబంధించి 2009, 2011లో శాస్త్రీయమైన సర్వేలు జరిగాయని, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక 3 రాష్ట్రాల్లో మూడో వంతు కూడా ముంపు ప్రభావం ఉండదని కేంద్రం తెలిపింది. ముంపు ప్రభావం లేకుండా కరకట్ట కట్టేందుకు ఏపీ సిద్ధమైనప్పటికీ.. ఒడిశా ప్రజాభిప్రాయ సేకరణకు ముందుకు రాలేదని జలశక్తి శాఖ సమావేశంలో వెల్లడించింది. పోలవరం బ్యాక్‌ వాటర్‌పై మరోసారి సర్వే చేయించాలని తెలంగాణ అధికారులు చేసిన వాదనను జలశక్తి శాఖ తోసిపుచ్చింది. 36 లక్షల క్యూసెక్కులు వెళ్లేలా స్పిల్‌వే కట్టాలని గోదావరి ట్రైబ్యునల్‌ సిఫార్సు చేసిందని, ప్రస్తుతం 50 లక్షల క్యూసెక్కుల వరద వెళ్లేలా ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.


పీపీఏ ఛైర్మన్‌ ఆర్కే గుప్తా మాట్లాడుతూ.. గోదావరి ట్రిబ్యునల్‌కు కట్టుబడే పోలవరం కడుతున్నట్టు తెలిపారు. కేంద్రం ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలను సంయుక్త సర్వేకు సహకరించాలని కోరామని వివరించారు. అయితే, సంయుక్త సర్వేకు ఒడిశా అంగికరించలేదని ఆయన వెల్లడించారు. పోలవరం కట్టినా గోదావరి వరద ముంపులో తేడా ఉండదని.. పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేయించామన్నారు. దీంతో బ్యాక్‌ వాటర్‌ సర్వేకు సంబంధించి సాంకేతిక అంశాలపై చర్చించేందుకు అక్టోబర్ 7 న నాలుగు రాష్ట్రాల ఈఎన్‌సీలతో మరోమారు భేటీ కావాలని కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్ణయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com