బిగ్బాస్ గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. జగిత్యాలలో ఆమెపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ ‘మై విలేజ్ షో’ కోసం గంగవ్వ చేసిన ఓ వీడియోలో రామచిలుకను ఉపయోగించడం ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. 2022 మేలో తీసిన ఆ వీడియోలో ఒక రామచిలుకను ఉపయోగించడంపై ఫిర్యాదు అందడంతో జగిత్యాల ఎఫ్ఆర్వో కేసు నమోదు చేశారు. గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజుపై కూడా అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాల కింద ఈ కేసు నమోదు చేసినట్లు జగిత్యాల ఎఫ్ఆర్వో పద్మారావు తెలిపారు.
జంతు సంరక్షణ కార్యకర్త గౌతమ్ చేసిన ఫిర్యాదు మేరకు గంగవ్వ, రాజుపై కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు. యూట్యూబ్లో వ్యూస్ కోసం రామచిలుకను హింసించి, వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని గౌతమ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో యూట్యూబర్ రాజు రూ. 25 వేలు జరిమానా చెల్లించారు.
యూట్యూబ్ ఛానల్ వీడియో కోసం చిలుకను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జంతు సంరక్షణ కార్యకర్త గౌతమ్.. జగిత్యాల జిల్లా ఫారెస్ట్ అధికారికి అక్టోబర్ 6న లేఖ రాశారు. 2022 మే 20న ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో రామచిలుకను ఉపయోగించారని గౌతమ్ ఆరోపించారు.
‘గంగవ్వ చిలుక పంచాంగం’ పేరుతో ఈ వీడియోను పబ్లిష్ చేశారు. జ్యోతిషం కోసం చిలుకను ఉపయోగించారు. ఇందులో గంగవ్వతో పాటు రాజు కూడా ఉన్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 4 ప్రకారం భారతీయ చిలుకను మనం సంరక్షించుకుంటున్నామని, కాబట్టి ఈ అంశంపై దర్యాప్తు చేయాలని గౌతమ్ తన ఫిర్యాదులో కోరారు.
ఇదిలాఉండగా.. బిగ్ బాస్ సీజన్ 8లోనూ గంగవ్వ అలరిస్తున్నారు. యువ నటులతో పోటీ పడి టాస్కులు గెలుస్తూ విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి గంగవ్వ ప్రవేశించారు. తనవైన మాటలు, ఆటతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు. మరోవైపు బిగ్ బాస్ గంగవ్వకు గుండెపోటు అంటూ వచ్చిన వదంతులను ‘మై విలేజ్ షో’ టీమ్ ఖండించింది.