ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గొంతులో దోసె ఇరుక్కుని వ్యక్తి మృతి.. ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న డాక్టర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 11:19 PM

ఒక్కోసారి చూడటానికి, వినడానికి కొన్ని ఘటనలు చాలా షాకింగ్‌గా అనిపిస్తాయి. అలాంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. దోసె ఓ వ్యక్తి ప్రాణం పోవటానికి కారణమైంది. అలాగని దోసె కారణంగా ఫుడ్ పాయిజన్ అయ్యి.. ఆ వ్యక్తి చనిపోలేదు. దోసె తింటూ చనిపోయాడు. వినడానికే షాకింగ్‌గా ఉన్న ఈ విషాద ఘటన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. కల్వకుర్తికి చెందిన 41 ఏళ్ల వెంకటయ్యకు మద్యం తాగే అలవాటుంది. యథాప్రకారమే మద్యం సేవించాడు వెంకటయ్య. ఆ తర్వాత భోజనం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇక దోసె తింటున్న సమయంలో అకస్మాత్తుగా అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో వెంకటయ్య ఊపిరాడక ఇబ్బందులు పడ్డాడు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది రావటంతో కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.


వెంకటయ్య పరిస్థితిని చూసి కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వెంకటయ్య చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో వెంకటయ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.దోసె కారణంగా ప్రాణం పోయిందని తెలిసి డాక్టర్లతో పాటుగా స్థానికులు కూడా దిగ్ర్భాంతికి లోనయ్యారు. మరోవైపు ఇటీవలే కేరళలోనూ ఇలాంటి ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఫుడ్ కాంపీటీషన్‌లో భాగంగా ఓ వ్యక్తి ఇడ్లీలు తింటూ.. గొంతులో ఇరుక్కుపోయి చనిపోయారు. అయితే సాధారణంగా చికెన్, మటన్ ముక్కలు గొంతులో ఇరుక్కుపోవటం సాధారణం. కానీ మెత్తగా ఉండే దోసె, ఇడ్లీలు కూడా ఇలా ఇరుక్కుపోయి.. ఏకంగా ప్రాణాలే పోవటం చర్చనీయాంశమైంది.


అయితే తినే సమయంలో జాగ్రత్త వహించాలని.. ఏవైనా గొంతులో ఇరుక్కుంటే ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయని వైద్యులు జాగ్రత్తలు చెప్తున్నారు. అధిక మొత్తంలో ఆహారాన్ని వేగంగా తినే ప్రయత్నం చేయడం.. లేదా తినే సమయంలో మాట్లాడటం కారణంగా కూడా గొంతులో ఆహారం ఇరుక్కునే ప్రమాదం ఉందంటున్నారు. ఆహారాన్ని మింగే సమయంలో శ్వాసనాళం మూసుకుపోతుందని.. కానీ తింటూ మాట్లడటం, వేగంగా ఆహారం తినే సమయంలో శ్వాసనాళం మూసుకుపోయే అవకాశం ఉండదంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆహారం శ్వాసనాళంలో ఇరుక్కుపోతుందని.. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్తున్నారు. కొద్దిసేపు శ్వాస ఆడకపోతే శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని.. ఎక్కువ సేపు ఊపిరి ఆడకపోతే మరణం కూడా సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com