హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న వందలాది ఆక్రమిత గ్రామ పంచాయతీ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధిస్తున్నట్టు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిందంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఇదే విషయంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దీంతో.. లేఅవుట్ల యజమానులు హెచ్ఎండీఏ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. కాగా.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో.. పూర్తిస్థాయిలో చర్చించేందుకు అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ శివార్లలో ఉన్న వందలాది పంచాయతీ లేఅవుట్లు హెచ్ఎండీఏ ఏర్పాడకముందే వెలిశాయి. ముఖ్యంగా రంగారెడ్డి, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్మెట్, ఆదిభట్ల, మంగల్పల్లి, మన్నెగూడ, తుర్కయంజాల్, కమ్మగూడ, రాగన్నగూడ, నాదర్గుల్, గుర్రంగూడ, బాలాపూర్ తదితర ప్రాంతాల్లో వందలాది పంచాయతీ లేఅవుట్లు ఉన్నాయి. వీటిని ఆ కాలంలోనే.. లేఅవుట్లు చేసి అమ్మేశారు కూడా. దీంతో.. ఆ స్థలాలు చాలా మంది చేతులు మారిపోయినట్టు తెలుస్తోంది. అయితే.. హెచ్ఎండీఏ ఏర్పడిన తర్వాత ఈ ఆక్రమిత లేఅవుట్లలో కొన్నింటిని క్రమబద్ధీకరించటంతో.. ఆ స్థలాల్లో పెద్ద పెద్ద బిల్డింగులు కూడా నిర్మించారు.
అయితే.. ప్రస్తుతం ఈ పంచాయతీ లేఅవుట్లు నగరానికి సమీపంలోనే ఉండటంతో.. ధరలు సైతం భారీగా పలుకుతున్నాయి. కాగా.. చాలా వరకు లేఅవుట్లను క్రమబద్ధీకరించలేదు. దీంతో.. గత ప్రభుత్వ హయాంలో ఎల్ఆర్ఎస్ చట్టం కింద క్రమబద్దీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో.. చాలా మంది రూ.1000 చెల్లించి లేఅవుట్ల క్రమబద్ధీకరణ(LRS) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలోనే ఆక్రమిత లేఅవుట్లను నిషేధిత జాబితాలో చేర్చారన్న వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతుండటంతో.. దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
పంచాయతీ లేఅవుట్లని ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 2007 నవంబర్ 19, సెక్షన్ 22ఎ(1)(ఈ) కింద ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నవాళ్లంతా ఈ విషయంపై అప్రమత్తమై హెచ్ఎండీఏ అధికారులను సంప్రదిస్తున్నారు. అయితే.. ఈ లేఅవుట్లలో ఏది నిషేదిత జాబితాలోకి వెళ్లింది.. ఏది వెళ్లలేదని భూయజమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. అయితే.. తమ భూమి నిషేధిత జాబితాలోకి వెళ్లిందా లేదా అన్నది చెక్ చేసుకునేందుకు కింద ఇచ్చిన లింకులను క్లిక్ చేసి తెలుసుకోండి.
https://www.hmda.gov.in/unauthorized-list-rr-dist
https://www.hmda.gov.in/sheet5-sheet6/
https://www.hmda.gov.in/sheet6-sheet8/