ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.10 వేలకే ఎకరం భూమికి హక్కు పత్రం.. మరో 10 వేలకు బ్యాంక్ లోన్ కూడా..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 23, 2024, 07:31 PM

రూ.10 వేలకే ఎకరం భూమికి హక్కు పత్రం ఇస్తారు.. మరో రూ.10 వేలు ఇస్తే బ్యాంకులో పంట లోన్ కూడా ఇప్పిస్తారు. ఇందేంటీ.. సర్కార్ ప్రవేశపెట్టిన కొత్త పథకమా.. అని డౌటనుమానం వచ్చిందా.. అస్సలు కాదు.. కొంత మంది గుట్టుగా నడిపిస్తున్న దందా. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో.. కొందరు దళారులు అటవీ భూములకు అటవీ హక్కు పత్రాల పేరుతో కొత్త దందాకు తెరతీశారు. అటవీ, మారుమూల గ్రామాల్లో ఉన్న రైతులకు మాయమాటలు చెప్పి.. నకిలీ పోడు పట్టాదారు పుస్తకాలు అప్పజెప్తూ.. నిలువునా మోసం చేస్తున్నారు.


గతేడాది పోడు భూములు సాగు చేసిన గిరిజన తెగకు చెందిన కోయ, లంబాడ, నాయకపోడు, ఎరుకల సామాజిక వర్గాల వారికి ప్రభుత్వం సర్వే చేసి పట్టాదారు పుస్తకం (అటవీ హక్కు పత్రాలు) జారీ చేసింది. దీన్నే అవకాశంగా తీసుకుని కొందరు అక్రమార్కులు.. నకిలీ అటవీ హక్కు పత్రాలను సృష్టిస్తూ.. డబ్బులు దండుకుంటున్నాడు. గ్రామాల్లోకి వెళ్లి తనకు రూ.10 వేలు ఇస్తే చాలు.. ఎకరం భూమికి పోడు పట్టాదారు పాస్బుక్ ఇస్తానని చెప్తూ.. మోసం చేస్తున్నాడు.


అయితే.. ఈ బ్రోకర్ చెప్పిన మాటలు నమ్మిన కొందరికి నకిలీ పట్టాదార్ పాస్ బుక్కులు అందించారు. దీంతో.. చుట్టుపక్కల గ్రామాలకు చెందినవాళ్లు కూడా.. 3, 4 ఎకరాలకు నగదు ముట్టజెప్పి పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందారు. ఓ అటవీ గ్రామంలో గిరిజనేతరులైన రైతులకు కూడా నకిలీ పోడు పట్టాలు ఇచ్చాడు. నల్లబెల్లి మండలంలో 5 గ్రామాలు, నర్సంపేట మండలంలో 3 గ్రామాల్లో ఈ నకిలీ పోడు పట్టా పుస్తకాలు జోరుగా చలామణి అవుతున్నాయి. గత యాసంగి సీజన్‌లో నర్సంపేటలోని ఓ బ్యాంకు నుంచి ఇవే నకిలీ పాస్ పుస్తకాలపై పంట లోన్లు కూడా పొందటం గమనార్హం.


సాధారణంగా రైతులు పంట లోన్ కోసం బ్యాంకుకు వస్తే పట్టాదారు పాసు పుస్తకం, 1బీ డాక్యుమెంట్, నో డ్యూ సర్టిఫికెట్ ఇలా రకరకాల పత్రాలు అడుగుతుంటారు. అంతేకాదు ఆ రైతు ఇచ్చిన డాక్యుమెంట్లు నిజమేనా కాదా అన్నది కూడా బ్యాక్ గ్రౌండ్ చెక్ చేస్తారు. అంతా సరిగ్గా ఉన్నప్పటికీ.. రకరకాల కొర్రీలు పెట్టి అరకొరగా లోన్ మంజూరు చేస్తుంటారు.


కానీ ఇక్కడ మాత్రం.. నకిలీ పోడు పట్టా పుస్తకాలకు అటవీ అధికారుల రికార్డులు పరిశీలించకుండా, నో డ్యూ ధ్రువపత్రం లేకుండానే బ్యాంకు అధికారులు లోన్ ఇస్తున్నారు. దీంతో బ్యాంకర్లపైనా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇంత బహిరంగంగానే.. నకిలీ పోడు పట్టాపాస్ పుస్తకాలు చలామణీ అవుతుండటంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com