మహబూబ్నగర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సోలార్ ప్లాంట్లో కేబుల్ దొంగతనానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కరెంట్ షాక్తో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం (సెప్టెంబర్ 10) అర్ధరాత్రి దాటిన తర్వాత మిడ్జిల్ మండల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని బోయిన్పల్లి గ్రామ శివారులో ప్రగతి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. అయితే ప్లాంట్లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరగుతున్నాయి. దీంతో సోలార్ ప్లాంట్ యాజమాన్యం రెండంచెలతో ఇనుప కంచెలను ఏర్పాటు చేసింది. అయినా దొంగతనాలు మాత్రం ఆగటం లేదు.
దీంతో ప్లాంట్ రెండో కంచెకు యాజమాన్యం విద్యుత్ షాక్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది. ఈ విషయం తెలియని దొంగలు ప్లాంట్లో దొంగతానానికి వెళ్లారు. కట్టర్ సాయంతో మొదటి కంచె కట్ చేసుకుని లోపలికి వెళ్లారు. అనంతరం రెండో కంచె కట్ చేసే క్రమంలో విద్యుత్ సరఫరా కావటంతో ఇద్దరు స్పాట్లోనే కుప్పకూలిపోయారు. కరెంట్ షాక్తో కన్నుమూశారు. ఉదయం మృతదేహాలను గమనించిన ప్లాంట్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతి చెందిన వారి వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా దొంగతనానికి వచ్చిన వారి వెంట మరో ఇద్దరు, ముగ్గురు ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో ఓ మహిళ కాలు గొలుసు పట్టీలు గుర్తించామన్నారు. అది దొంగతనం చేసిందా.. లేక ముఠాలో మహిళ కూడా ఉందా అనేది విచారణలో తేలుస్తామన్నారు. ఇక నిబంధనలకు విరుద్దంగా కంచెకు విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసిన ప్లాంటు నిర్వహకులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
గృహిణి పై డెలివరీ బాయ్ అత్యాచారయత్నంఇక నిర్మల్ జిల్లాలో ఓ గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆర్డర్ను డెలివరీ చేసేందుకు వెళ్లిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయగా.. పక్కింటి వారు వచ్చేలోపు సదరు కామాంధుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విఘ్నేశ్ను అదుపులోకి తీసుకున్నారు.