ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు కొత్త ఎయిర్‌పోర్ట్.. ఈ జిల్లాలోనే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 08:55 PM

తెలంగాణకు కొత్త ఎయిర్‌పోర్టు మంజూరు చేయాలని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడ్ని రాష్ట్ర ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. రాష్ట్రానికి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు మంజూరు చేయాలని కోరుతూ లేఖ రాశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ఎయిర్‌పోర్టుతో సహా కొత్తవి ఏర్పాటు చేయడానికి ఉన్న డిమాండ్ల గురించి లేఖలో కోమటిరెడ్డి వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలోని శంషాబాద్‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తప్ప ఏ జిల్లాలోనూ విమానాశ్రయాలు లేవని అన్నారు.


ఈ మేరకు రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి చొరవ తీసుకోవాలన్నారు. కొత్త ఎయిర్‌పోర్ట్ మంజూరు చేస్తే అది నిర్మించేందుకు ఉన్న అవకాశాలను మంత్రి కోమటిరెడ్డి లేఖలో వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని సర్వే నంబర్‌ 999లో ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు అవకాశం ఉందన్నారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అవసరమైన భూముల అక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇప్పటికే పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.


ప్రస్తుతం కొత్తగూడెం జిల్లాలో సింగరేణి, బీటీపీఎస్‌, హెవీ వాటర్‌ ప్లాంట్‌, కేటీపీఎస్‌, ఐటీసీ, ఎన్‌ఎండీసీతోపాటు నవభారత్‌ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయని చెప్పారు. ఈ జిల్లాలో వ్యాపార, వాణిజ్య లావాదేవీలు నానాటికీ పెరుగుతున్నాయని లేఖలో వివరించారు. భద్రాచలం పట్టణంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీరాముడి ఆలయం ఉందని... అక్కడకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారని చెప్పారు. వీటిన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాభివృద్ధికి దోహదపడేందుకుగాను కొత్తగూడెం జిలాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం మంజూరు చేయాలని కోమటిరెడ్డి లేఖలో స్పెషల్ రిక్వెస్ట్ చేశారు.


కాగా, కేంద్రం సానుకూలంగా స్పందించి కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనుంది. వరంగల్‌లో ప్రస్తుతం ఉన్న ఎయిర్‌స్ట్రిప్ కూడా విస్తరించి అక్కడి నుంచి కూడా విమానాలు నడపాలనే డిమాండ్ వినిపిస్తోంది. దాంతో పాటు నిజామాబాద్ ప్రాంతంలోనూ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం తెలుగు వ్యక్తి కేంద్ర విమానయానశాఖ మంత్రిగా ఉండగా.. వీటన్నింటికి మోక్షం కలుగుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com