తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేశారు. జులై 18న తొలి విడతలో రూ. లక్ష వరకు రుణాలు, ఆ తర్వాత జులై 31న రెండో విడతలో రూ. లక్షన్నర వరకు, ఆగస్టు 15న మూడో విడతలో రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేశారు. మూడు విడతల్లో కలిపి మెుత్తంగా రుణమాఫీ కోసం రూ.31 వేలు కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అయితే అర్హులైనా కొందరు రైతులకు రుణమాఫీ వర్తించలేదు. ఈ మేరకు పలు చోట్ల రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. మెుత్తం 31 సాంకేతిక అంశాలతో అర్హులకు రైతు రుణమాఫీ అందలేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ నివేదికను తయారు చేసింది. పట్టా, బ్యాంకు, ఆధార్ కార్డుల్లో పేర్లు సరిపోలకపోవటం, రేషన్ కార్డులు లేకపోవటం తదితర కారణాలతో రుణమాఫీ వర్తించలేదు.
అటువంటి వారి కోసం వ్యవసాయశాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. గ్రామాలు, మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఓపెన్ చేసి రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లి వివరాలను సేకరించటంతో పాటుగా ప్రత్యేక యాప్లో వారి వివరాలు నమోదు చేస్తున్నారు. త్వరలోనే సర్వే పూర్తి చేసి, సర్వేలో గుర్తించిన రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం సర్వే పూర్తయిందని చెప్పారు. త్వరలోనే వారి అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు.
రుణమాఫీ కాని రైతుల నుంచి డబ్బు వసూలు
ఇక రుణమాఫీ కాలేదని అఫ్లికేషన్ చేసుకునేందుకు వెళ్తున్న రైతుల నుంచి కొందరు వ్యవసాయాధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దరఖాస్తుల స్వీకరణతోపాటు ఆధార్కార్డుల పరిశీలన, ఫొటోలు తీయటం, కుటుంబాల నమోదు, అఫిడవిట్లు కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రైతుల నుంచి రూ.2 వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. కొందరు అధికారులు డబ్బులు వసూలు చేయటమే కాకుండా ప్రభుత్వమే తీసుకోవాలందని రైతులకు మభ్య పెడుతున్నారు.
ఈ ఫిర్యాదులపై వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఏ అధికారిర అయినా డబ్బులు తీసుకున్నట్లు నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల డీఏవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా రైతుల నుంచి రైతులు డబ్బులు వసూలు చేయవద్దని రఘునందన్ రావు సూచించారు.