ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెరువులను మీరే వదలండి.. లేకపోతే - సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 07:27 PM

చెరువులను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినవాళ్లు గౌరవంగా తప్పుకొని ప్రభుత్వానికి భూములు అప్పగించాలని, లేకపోతే ఉన్నపళంగా నేలమట్టం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చిందే ఇందుకోసమని స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు పంపడానికి కూడా వెనుకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. బుధవారం (సెప్టెంబర్ 11) ఉదయం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రసంగిస్తూ హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు.


‘కొంత మంది గొప్పవాళ్లు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్‌లు కట్టుకుంటున్నారు. ఫాంహౌస్‌ల నుంచి నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారు. నాలాల ఆక్రమణలతో వరదలు ఉప్పెనలా వస్తున్నాయి. దీంతో పేదల ఇండ్లు మునుగుతున్నాయి. హైదరాబాద్‌ కాలుష్యం నల్గొండకు చేరుతోంది. చెరువుల్లో, నాళాలపై ఆక్రమణలను తొలగించేందుకు నా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆక్రమణలను తొలగించి మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు


నగరంలోని చెరువుల పరీవాహక ప్రాంతంలో పేదల ఆక్రమణలు కూడా ఉన్నాయని... వారి పట్ల ప్రభుత్వం మానవతా ధోరణితో వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ వెంట ఉన్న 11 వేల మంది బాధితులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.


‘దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించాం. హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించినోళ్లను చెరబట్టాలని.. చెరబట్టినోళ్ల నుంచి విడిపించాలని.. అలాంటి వాళ్లను అవసరమైతే చెరసాలకు తోలాలనేదే మా ప్రభుత్వం విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామహులున్నా.. వాళ్లు చెరువులను వదలక తప్పదు. అందుకే ఈ వేదిక నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. అయ్యా.. ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి. గౌరవంగా పక్కకు తప్పుకోండి. నీటి పారుదల శాఖకు ఆ భూములు అప్పగించండి. మీకేం కావాలో పోయి దూరంగా కట్టుకోండి. లేకపోతే, ఉన్నపళంగా నేలమట్టంగా కూలుతాయి. కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ FTL లో గానీ, బఫర్ జోన్‌లో గానీ, నాళాలలో ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో.. వాటన్నింటినీ నిరభ్యరంతంగా మేం తొలగిస్తాం. మీరు ఎక్కడికి వెళ్లినా, తాత్కాలికంగా కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నా.. న్యాయస్థానాలల్లో కూడా కొట్లాడి, ఆ స్టేలను వెకేట్ చేయించి, మీ ఆక్రమణలను తొలగిస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.


వరుసగా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తున్నాం..


టీజీపీఎస్సీపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లను ఇస్తోందని చెప్పారు. నిరుద్యోగుల అభ్యర్థన మేరకే గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేశామని అన్నారు.


‘గత ప్రభుత్వ హయాంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్‌ 3న ప్రజాపాలన ఆవిర్భవించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 30,000 పైగా ఉద్యోగాలు ఇచ్చాం. మరో 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.


త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో వ్యసనాలకు తావు లేదని.. సైబర్‌, గంజాయి నేరాలను ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కులవృత్తులతో పాటు చేతి వృత్తులను బలోపేతం చేస్తున్నామని.. రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com