ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ లిక్కర్ కేసు.. కోర్టు విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 07:19 PM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణకు హాజరయ్యారు. బుధవారం కేసు విచారణ సందర్భంగా వర్చువల్‌గా ఆమె ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు వచ్చారు. ఈ కేసులో ఇటీవలె సీబీఐ దర్యాప్తును ముగించి.. తుది ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇక ఇప్పటికే ఈ కేసులో బెయిల్ పొందిన కల్వకుంట్ల కవిత.. జైలు నుంచి బయటికి వచ్చి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె కోర్టు విచారణకు హాజరయ్యారు. కవితతోపాటు ఈ కేసులో బెయిల్ పొందిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా సహా పలువురు నిందితులు కూడా కోర్టు ముందు వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. అనంతరం సీబీఐ దాఖలు చేసిన తుది ఛార్జిషీట్‌పై విచారణను కోర్టు.. ఈనెల 25వ తేదీకి వాయిదా వేసింది.


ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా.. విచారణను సెప్టెంబర్ 25వ తేదీకి వాయిదా వేశారు. ఈ కేసులో ప్రతివాదులు అందించిన ఛార్జ్‌షీట్‌లో క్లారిటీగా లేని పత్రాలను తాజా విచారణ సందర్భంగా అందిస్తున్నట్లు సీబీఐ తరఫు లాయర్ కోర్టుకు వివరించారు. ఛార్జ్‌షీట్‌ కాపీలను అనువదించి ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫు లాయర్ తెలిపారు. ఛార్జ్‌షీట్‌ కాపీలో తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు సరిగా లేవని పేర్కొన్నారు.


ఈ క్రమంలోనే కేసులో ప్రతివాదులుగా ఉన్న వారు అడిగిన కాపీలను ఇవ్వాలని సీబీఐ అధికారులకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ తుది ఛార్జ్‌షీట్‌పై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో గత 2 ఏళ్లుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియా.. ఆ తర్వాత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పటికి జైలులోనే ఉన్నారు. ప్రస్తుతం సీబీఐ కేసులో కేజ్రీవాల్‌ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను పూర్తి చేసిన సుప్రీంకోర్టు.. తీర్పును వాయిదా వేసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com