ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీళ్లకు మాత్రమే పంట నష్ట పరిహారం.. విధివిధానాలు ఖరారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 08:12 PM

ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. వాగులు, వంకలు పొంగి పొర్లటంతో ఊర్లకు ఊళ్లు ముంపునకు గురయ్యాయి. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. పశువులు వరదలో కొట్టుకుపోయాయి. దీంతో ముంపు బాధితులను ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. పంట నష్టపోయిన రైతులకు పరిహారం కూడా చెల్లిస్తామని ప్రకటించింది.


ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించేందుకు రేవంత్ ప్రభుత్వం తాజాగా విధివిధానాలు ఖరారు చేసింది. కనీసం 33 శాతం నష్టపోయిన పంటలకు పరిహారం అందజేయాలని అధికారులు నిర్ణయించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఈనెల 12లోగా వివరాలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిని జిల్లా అధికారులు నిర్ధారించి, కలెక్టర్లకు పంపాలని ఆదేశాల్లో పేర్కొంది. వారి ఆమోదంతో అర్హులైన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదనలు పంపాలని చెప్పింది. అనంతరం రైతుల అకౌంట్లలో పరిహారం డబ్బులు జమ చేయనున్నారు.


నేటి నుంచి వరద బాధితులకు పరిహారం..


ఇక ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం అందించనుంది. అధికారులు 3 రోజులపాటు సర్వే నిర్వహించి జిల్లావ్యాప్తంగా వరద బాధితులను గుర్తించారు. సుమారు 22 వేల కుటుంబాలు బాధితులుగా గుర్తించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు వరద బాధితులు అందరికీ రూ.10 వేల చొప్పున వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ 3 రోజుల్లో ముగుస్తుందని అధికారులు వెల్లడించారు.


29 వరద ప్రభావిత జిల్లాలు గుర్తింపు గత వారం కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మినహా మిగతా అన్ని జిల్లాలు వరద ప్రభావిత జిల్లాలుగా అధికారులు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాల్లో నమోదైన వర్షపాతం, జరిగిన నష్టాన్ని అంచనా వేసి వరద ప్రభావిత జిల్లాలను ప్రకటించారు. ఇక ఇప్పటికే 4 జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేసినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. మిగతా 25 జిల్లాలకు రూ.3 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ఆమె వెల్లడించారు. సహాయ, పునరావాస చర్యలపై రేపు హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com