ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖైరతాబాద్‌ మహాగణపతికి సీఎం రేవంత్‌ తొలి పూజ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 07, 2024, 08:10 PM

దేశవ్యాప్తంగా వినాయక చవితిఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్‌ గణేషుడు.. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడ గణేశ్‌ ఉత్సవాలు ప్రారంభించి ఈ ఏడాదికి 70 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో గణేషుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. దీంతో భక్తులు భారీ సంఖ్యలో హాజరై.. మహా గణపతిని దర్శించుకుంటున్నారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో తొలిసారిగా ఖైరతాబాద్ మహా గణేషుడిని దర్శించుకొని తొలి పూజలు నిర్వహించారు. గణేశ్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎం రేవంత్‌ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. ఈ పూజా కార్యక్రమంలో సీఎంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరలు పాల్గొన్నారు. పూజల అనంతరం సీఎంను ఉత్సవ సమితి నిర్వహకులు ఘనంగా సత్కరించారు.


ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. గతేడాది తాను పీసీసీ అధ్యక్షుడి హోదాలో పూజలకు హాజరైనట్లు చెప్పారు. ఈసారి సీఎం హోదాలో పూజలో పాల్గొన్నట్లు తెలిపారు. 1954 నుంచి ఉత్సవ సమితి నిర్వహకులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారన్నారు. తనను ఉత్సవ సమతి నిర్వహకులు ఎప్పుడు పిలిచినా వస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలపై గణపయ్య ఆశీస్సులు ఉండాలన్నారు.


'దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోంది. 70 ఏళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతోఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం. ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుంది. హైదరాబాద్ నగరంలో 1 లక్షా 40 వేల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. అందరి పూజలు, దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డాం. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి నా అభినందనలు. స్వర్గీయ పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయం. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నా. ప్రతీ ఏటా ఉత్సవ కమిటీ ఎప్పుడు ఆహ్వానించినా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటా.' అని సీఎం రేవంత్ అన్నారు.


వినాయక చవితి సందర్భంగా సీఎం రేవంత్‌ కుటుంబసభ్యులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం సీఎంను మర్యాదపూర్వకంగా కలిసేందుకు రేవంత్ ఇంటికి వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్.. అక్కడ నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. సీఎం రేవంత దంపతులతో పాటు కూతురు, అల్లుడు, మనవడు పూజల్లో పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వేడకులు ఘనంగా జరుగుతున్నాయి. గణపతి నామస్మరణతో రాష్ట్రంలోని పలు ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com