ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటికి 'హైడ్రా' నోటీసులు..? స్పందించిన కమిషనర్ రంగనాథ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 07:42 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఎవ్వరినీ లెక్క చేయకుండా బుల్డోజర్లు పంపిస్తున్నారు. దీంతో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇక ఇప్పటికే కొందరు అక్రమ నిర్మాణదారులకు హైడ్రా అధికారులు నోటీసులు పంపారు. మాదాపూర్‌ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సైతం హైడ్రా అధికారులు నోటీసులు పంపారు.


 ఇక ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సైతం హైడ్రా నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాతో పాటు పలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ జగన్ లోటస్ పాండ్ ఇంటికి నోటీసులు పంపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రేపో మాపో జగన్ ఇంటిని కూడా హైడ్రా అధికారులు కూల్చేయనున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తాజాగా స్పందించారు. జగన్‌ ఇంటికి నోటీసుల ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారం నిజం కాన్నారు. సోషల్‌ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తాము ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు.


నేడు పటాన్‌చెరులో రంగనాథ్ సుడిగాలి పర్యటన చేపట్టారు. స్థానిక సాకి చెరువును అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి.. అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెరువుకు ఉన్న తూములు క్లోజ్ చేసి ఇన్‌కోర్‌ సంస్థ అపార్టుమెంట్‌ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అపార్టుమెంట్‌ను పరిశీలించిన రంగనాథ్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.


అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని చెప్పారు. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎంతటివారికైనా నోటీసులు పంపటంతో పాటు అక్రమమని తెలిస్తే కూల్చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఇంటికి నోటీసులపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన రంగనాథ్.. ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. ఇక అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన ఆరుగురు అధికారులపై హైదరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైడ్రా సిఫార్సుల మేరకు అధికారులపై చర్యలు తీసుకున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com