కన్న కలలు నెరవేరకముందే అర్ధాంతరంగా ఓ ట్రైనింగ్ కానిస్టేబుల్ తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చింతపల్లి మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లి గ్రామానికి చెందిన పాలకూర్ల ఆంజనేయులు తండ్రి సత్తయ్య, అనే యువకుడు ఇటీవల హైదరాబాదులో ని గోషామహల్ ట్రైనింగ్ సెంటర్లో ఉద్యోగరీత్యా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సెలవుల్లో భాగంగా ఆగస్టు 25 న ఎనిమిది గంటల ప్రాంతంలో హైదరాబాదు నుండి చింతపల్లికి తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆగస్టు 28న ఉదయం 8:30 ప్రాంతంలో బోరు బావి వద్దకు వెళ్లి స్నానం చేసి వస్తానని ఇంట్లో వాళ్లకు చెప్పి వెళ్ళాడు. స్నానం చేసి వస్తానని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిన ఆంజనేయులు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా పురుగుల మందు తాగి ఉండటంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆంజనేయులు మాల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
అదే రాత్రి మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఉన్న కేర్ ఆసుపత్రికి తరలించారు,. గత మూడు రోజుల నుండి చికిత్స పొందు తూ శుక్రవారం 11 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. గత కొద్ది రోజుల నుండి ఆంజనేయులు మానసిక స్థితి సరిగ్గా లేనందున తనకు గుబులు గుబులుగా ఉందంటూ నేను బ్రతకను చనిపోతానని ఒకటి రెండు సార్లు కుటుంబ సభ్యులతో పేర్కొన్నాడు. నా కుమారుడు మరణం పట్ల ఎలాంటి అనుమానాలు లేవని తండ్రి పాలకూర్ల సత్తయ్య పేర్కొన్నాడు. మా పిల్లవాడి మతిస్థిమితం సరిగా లేకనే పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి సత్తయ్య పేర్కొన్నాడు. మృతుడి తండ్రి సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చూసుకొని దర్యాప్తు చేస్తున్నారు.