తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. అధికార పక్షంపై కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కౌడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని.. ఇకనైనా అసలు పనులపై దృష్టి పెట్టండంటూ రేవంత్ రెడ్డి సర్కారుకు చురకలంటించారు. హైదరాబాద్ నగరానికి రేవంత్ రెడ్డి సర్కారు కేటాయించిన బడ్జెట్ సరిపోదన్నారు. ఓవైపు భారీ వర్షాలు కురుస్తున్నా జీహెచ్ఎంసీ మాత్రం నిద్రావస్థలో ఉందని విమర్శించారు. గతంలో చాలా కాలనీలను వరద ముంపు నుంచి కాపాడగలిగామని గుర్తుచేసిన వివేకానంద.. ప్రస్తుతం 17 ప్రాంతాలు డేంజర్ జోన్లో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే నాళాలు ఉప్పొంగి ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని వివేకానంద తెలిపారు.
మరోవైపు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనావస్థకు చేరిందని వివేకానంద తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊరట కలిగించేలా.. కొత్త ప్రాజెక్టు తీసుకురావాలని సూచించారు. దేశంలోనే 50 శాతం ఐటీ ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. కానీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం పదేళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ సత్యదూరమైన మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. ఐటీ అభివృద్ధి విషయంలో మంత్రికి తాము సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. నగరంలో ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య లేదని.. ఇందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని వివేకానంద గౌడ్ వివరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 36 ప్రాజెక్టులను పూర్తి చేశామని పేర్కొన్నారు. మంత్రులు నగరంలో తిరిగితే గానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో కనిపించదని వివేకానంద గౌడ్ సెటైర్లు విసిరారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్లో శాంతి భద్రతల విషయంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో అమాయకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారని.. ఇండ్ల ముందు నిలుచున్న యువకులను కూడా కొడుతున్నారంటూ మండిపడ్డారు. పాతబస్తీ రోడ్లపై తానే స్వయంగా నిలబడతానని.. ఎవరు వస్తారో చూస్తానంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.