హైదరాబాద్లో ఓ యువతి క్యాన్సర్ను జయించటమే కాదు.. పండంటి శిశువుకు జన్మనిచ్చింది. హైదరాబాద్ కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ డాక్టర్ల చొరవతో ఎప్పటికీ పిల్లలు పుట్టరని భావించిన ఆమె మాతృత్వ మధురిమను పొందింది. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్తో బాధపడుతున్నవారికి కొత్త ఆశలు కల్పిస్తూ.. వారిలో ధైర్యాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన మౌనిక (27), మహేష్ దంపతులు. పెళ్లయిన కొద్దిరోజులకే మౌనిక గర్భం దాల్చింది. అయితే కడుపులోని గర్భస్థశిశువుకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమె తీవ్ర అనారోగ్యం బారినపడింది. పరీక్షించిన డాక్టర్లు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకినట్లు గుర్తించారు. తప్పనిసరిగా గర్భసంచి తొలగించాలని (హిస్టరెక్టమీ) స్థానిక డాక్టర్లు వెల్లడించారు.
దీంతో ఆమె సెకండ్ ఓపీనియన్ కోసం కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రోబోటిక్ అండ్ ల్యాప్రోస్కోప్ సర్జన్ డాక్టర్ వసుంధర ఆమెలో కొత్త ఆశలు రేకెత్తించారు. క్యాన్సర్ ఉన్నంత మాత్రాన గర్భసంచి తొలగించాల్సిన పనిలేదని చెప్పారు. అలా తొలగిస్తే ఇక జీవితాంతం పిల్లలు పుట్టే అవకాశం ఉండదన్నారు. దాన్ని తొలగించకుండానే క్యాన్సర్ చికిత్స చేయవచ్చునని అన్నారు. ఆ తర్వాత పిల్లలను కూడా పొందవచ్చునని సూచించారు. కిమ్స్ డాక్టర్ల కౌన్సెలింగ్తో మౌనిక దంపతులు క్యాన్సర్ చికిత్సకు ఒప్పుకొన్నారు. దీంతో డాక్టర్లు తొలుత ఆమె పిండాలను ఫ్రీజ్ చేశారు. అనంతరం క్యాన్సర్ చికిత్స ప్రారంభించి.. చికిత్సను విజయవంతంగా పూర్తి చేసారు.
ఆ తర్వాత ఫ్రీజ్ చేసి రెండు పిండాలను ఆమె గర్భ సంచిలో ప్రవేశపెట్టారు. గర్భ సంచి రెండు పిండాలను మోసే పరిస్థితి ఉండకపోవచ్చనని భావించి ఒక పిండాన్ని ముందుగానే తీసేశారు. అనంతరం ప్రతివారం గర్భస్థ శిశివు ఆరోగ్యాన్ని మానిటరింగ్ చేసారు. 37 వారాల తర్వాత.. అంతా బాగుండటంతో ఆమెకు సర్జరీ చేసి పండంటి ఆడ శివువును ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో చక్కటి పాప పుట్టిందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. కాగా, క్యాన్సర్ను జయించి పండంటి శిశువుకు జన్మనిచ్చిన మౌనిక.. గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్న చాలా మందిలో స్పూర్తిని, ధైర్యాన్ని నింపారు.