సైబర్ కేటుగాళ్లు తెలివిమీరి అమాయకపు ప్రజల్ని దోచుకుంటున్నారు. తాజాగా.. నిజామాబాద్ జిల్లాలో ఓ సైబర్ మోసం ఫోన్ కాల్ వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ కేసులో మీ నాన్న ఇరుక్కున్నాడంటూ సైబర్ నేరగాళ్లు అమాయకురాలికి ఫోన్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే కాళ్లు, చేతులు నరికేసి జైలులో వేస్తామని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఓ యువతికి సైబర్ క్రిమినల్స్ వాట్సాప్ కాల్ చేశారు.
పోలీస్ డీపీతో ఉన్న నెంబర్తో హిందీలో మాట్లాడారు. ఫోన్ చేసిన వ్యక్తి తనకు తాను పోలీస్ ఆఫీసర్నని పరిచయం చేసుకున్నాడు. మీ నాన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడని భయపెట్టాడు. రూ. 10 వేలు వెంటనే పంపిస్తే వదిలేస్తామని లేదంటే కాళ్లు, చేతులు నరికేసి జైలులో వేస్తామని బెదిరించారు. బాధిత యువతి తండ్రి పేరు, కుటుంబీకుల వివరాలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పటంతో ఆమె షాక్కు గురైంది. తన తండ్రిని అరెస్టు చేసింది నిజమేనని నమ్మింది. దీంతో కాళ్ల బేరానికి వచ్చి తన వద్ద రూ. 5 వేలే ఉన్నాయని వేడుకుండి.
అనంతరం పక్కింట్లోకి వెళ్లి వారితో ఫోన్ మాట్లాడించింది. దీంతో వారు బాధిత యువతి తండ్రితో మాట్లాడించాలని కోరారు. సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా.. యువతి తండ్రి ఏడుస్తున్నాడంటూ ఏడుపు శబ్ధం వినిపించారు. ఆ తర్వాత ఇప్పుడు రూ. 5 వేలు పంపు.. మిగతావి మళ్లీ పంపించండి అంటూ సీరియస్గా ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత యువతి తన తండ్రికి ఫోన్ చేయగా.. తాను బాగానే ఉన్నానని ఆయన చెప్పాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్లు పంథా మార్చి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని.. ఇటువంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అనుమానం ఉంటే వెంటనే సమీపంలోని పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని కోరారు.