బోనాల పండుగ అంటే.. చాలా మంది యువత తాగడం, ఎగరడం మాత్రమే అనుకుంటుంన్నారని.. బోనాల పండుగ అంటే అది కాదన్నారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. బోనాల పండుగ అంటే.. మన ధర్మం, సంస్కృతి అని చెప్పుకొచ్చారు. మన సంస్కృతిని కాపాడటం మన అందరి బాధ్యత అని.. యువతకు ఈ పండుగ ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. కొంత మంది మాత్రం.. బోనాల పండుగ అంటే తాగే పండుగ అని ప్రొజెక్ట్ చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని వివరించారు.
బోనాల పండుగలో హిందూ భక్తులు.. తమ కుటుంబం బాగుండాలని మేకలు, గొర్రెలను అమ్మవారికి సమర్పిస్తారని రాజాసింగ్ వివరించారు. అయితే.. ఆ మేకను బలిచ్చే వాళ్లు ముస్లింలై ఉంటారని చెప్పుకొచ్చారు. హిందువుల్లో కూడా కొంత మంది మేకలను కోసేవాళ్లు ఉంటారని.. వారిని పిలిపించి కోపించుకోవాలని సూచించారు. ఎందుకంటే.. ముస్లిం వాళ్లతో కోపిస్తే.. వాళ్లు అల్లాకి సమర్పించేటట్టు ఫాతియా చదివి హలాల్ చేసి కోస్తారని.. దాంతో అది ఎంగిలి అవుతుందని తెలిపారు. అమ్మవారికి ఎంగిలి చేసిందని బలి ఇవ్వకూడదని.. హలాల్ని బహిష్కరణ చేయాలంటూ రాజాసింగ్ పిలుపునిచ్చారు.
రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ఇప్పుడు బోనాల సమయంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చర్చగా మారింది. మరోవైపు.. తెలంగాణలో వాడీవేడీగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు రాజాసింగ్ హాజరుకాకపోవటం గమనార్హం.