తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విద్యుత్ కోనుగోళ్ల అంశంపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరుగకపోతే విచారణ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఎందుకు హాజరుకాలేదని రేవంత్ ప్రశ్నించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంత నిజాయితీపరులైతే కమిషన్ ఎదుట ఎందుకు వివరాలు సమర్పించలేదని ప్రశ్నించారు. సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్కు కొత్త చైర్మన్ను నియమిస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.
రేవంత్ కామెంట్లపై జగదీష్ రెడ్డి ఘూటుగా బదులిచ్చారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు వెళ్లిన విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తాను చర్లపల్లి జైలుకు వెళ్లలేదని తెలంగాణ ఉద్యమ సమయంలో చంచల్ గూడ జైలుకు వెళ్లానని చెప్పారు. చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాన్ని రేవంతే గుర్తు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ కామెంట్లపైకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. 'సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేసిన విషయాన్ని జగదీష్ రెడ్డి మర్చిపోయాడు' అంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీంతో సభ ఒక్కసారిగా దద్దరిల్లింది.
మధ్యలో కలుగజేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జగదీష్ రెడ్డిది మెుదట్నుంచి నేర చరిత్రే అని అన్నారు. 'మర్డర్ కేసులో జగదీష్ రెడ్డి ఏ-2 ముద్దాయి. మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు. రాంరెడ్డి అనే వ్యక్తి హత్య కేసులో ఏ-6గా ఉన్నాడు. లక్షా 80 వేల దొంగతనం కేసులో జగదీష్ రెడ్డి ముద్దాయి. నేను చెప్పిన కేసుల్లో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు.' అంటూ మంత్రి కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి చేసిన ఈ కామెంట్లపై జగదీష్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ కామెంట్లను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ను విజ్ఞప్తి చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని సవాల్ విసిరారు. కోమటిరెడ్డి చెప్పిన మూడు కేసుల్లోనూ తనకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. కాగా, జగదీష్ రెడ్డి సవాల్ను కోమటిరెడ్డి స్వీకరించారు. ఆయనపై తాను చేసినవి ఆరోపణలు కాదని.. అవి పూర్తిగా నిజమని చెప్పారు. ఒకవేళ అవి అసత్య ఆరోపణలు అయితే తాను ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. స్పీకర్ కలుగజేసుకొని అధికార, ప్రతిపక్షాలను వారించటంతో సభ సజావుగా సాగింది.