కరీంనగర్ జిల్లాకు చెందిన కె.సౌమ్య(20) కొంతకాలం క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చింది. ఖైరతాబాద్ ప్రాంతంలో ఓ గదిలో అద్దెకుంటోంది. అక్కడే ఉన్న వాసవీ అనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. సమయానికి డ్యూటీకి వెళ్తూ.. తోటివారితో స్నేహంగా ఉండటమే కాకుండా.. విధుల్లోనూ చురుకుగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. అయితే.. శుక్రవారం రోజు సౌమ్య నైట్ డ్యూటీకి వెళ్లాల్సి ఉంది. కానీ.. ఎంతసేపటికీ తను డ్యూటీకి రాలేదు. డ్యూటీ టైం దాటిపోయినా సరే ఆస్పత్రికి రాకపోవటం.. ఎవ్వరికీ కనీసం సమాచారం ఇవ్వకపోవటంతో.. స్నేహితులు ఆమెకు కాల్ చేశారు. కాల్స్కి కూడా స్పందించకపోవటంతో.. అనుమానం వచ్చిన ఆమె స్నేహితుడు ప్రశాంత్.. రాత్రి ఏడున్నర ప్రాంతంలో ఆమె గదికి వెళ్లాడు.
తలుపు కొట్టినా తీయలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూస్తే.. బాత్రూంలో సౌమ్య ఊహించని స్థితిలో అచేతనంగా పడి ఉంది. అక్కడున్న పరిస్థితిని గమనించి.. వెంటనే హీటర్ స్విచ్ ఆఫ్ చేసి.. ఆమెను ఆస్పత్రికి తరచించాడు. అయితే అక్కడ సౌమ్యను పరిశీలించిన వైద్యులు..ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హీటర్ స్విచ్ ఆన్ చేసి బకెట్లో పెట్టే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుందని.. మృతురాలి శరీరంపై కూడా హీటర్ వల్ల కాలిన గాయాలు ఉండటంతో.. ఆ కారణంతోనే సౌమ్య మరణించినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సౌమ్య తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సౌమ్య మృతితో ఆమె కుటుంబంలోనే కాదు.. ఆస్పత్రిలోని స్టాఫ్ కూడా విషాదం వ్యక్తం చేశారు.
ఇటీవలే ఓ కుటుంబం బాత్రూంలో గ్యాస్ గీజర్ వల్ల ప్రాణాలు కోల్పోయిన విషయం అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఆ ఘటనను మర్చిపోకముందే.. వాటర్ హీటర్ వల్ల షాక్ తగిలి ఓ నర్సు ఇలా మృతి చెందటం ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతోంది. అటు గీజర్, ఇటు హీటర్ రెండింటినీ వాడటంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఊహించని పరిణమాలు చోటుచేసుకునే ప్రమాదాలు ఉన్నాయి.