ప్రస్తుతం తెలంగాణలో సీనియర్ ఐఏఎస్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ ఏం ట్వీట్ చేసినా.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఓల్డ్ రాజేంద్రనగర్లోని రావుస్ స్టడీ సర్విల్లోని బేస్మెంట్లోకి వరద నీరు చేరి.. ముగ్గురు విద్యార్థులు మరణించి విషయం తెలిసిందే. ఈ విషాదకర ఘటనపై స్మితా సబర్వాల్ స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు.
"ప్రతి సంవత్సరం లక్షలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పించేందుకు.. ఎంత ఖర్చునైనా భరిస్తూ.. సుదూర ప్రాంతాల్లో ఉన్న మెట్రో నగరాల్లోని కోచింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేందుకు ఆ పిల్లలు.. ఆ నగరాల్లో ఎన్ని అసమానతలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కుంటూ.. ముందుకు సాగుతారు." అని ఢిల్లీ లాంటి నగరాల్లో దేశం నలుమూలల నుంచి కోచింగ్ సెంటర్లకు వస్తున్న అభ్యర్థుల ఇబ్బందుల గురించి ట్విట్టర్ వేదికగా రాసుకోచ్చారు.
దాంతో పాటు.. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదంలో ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు మరణించడం నిజంగా దిగ్భ్రాంతికరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం కారణంగానే వారి విలువైన ప్రాణాలు పోయాయని స్మితా సబర్వాల్ అభిప్రాయపడ్డారు. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సేఫ్టీ ప్రోటోకాల్లను పాటించాలని అన్ని కోచింగ్ సెంటర్లకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా స్మితా కోరుకున్నారు.
కాగా.. స్మితా చేసిన ట్వీట్కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. అందులో ఓ నెటిజన్.. "మేడమ్, ఇది ప్రమాదం కాదు. అవినీతి పాలనా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా జరిగిన హత్య. ప్రమాదం జరిగేంతవరకు ఎలాంటి మార్పు రాకపోవడం మన దేశ దౌర్భాగ్యం. పిల్లలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు ఎంత బాధను అనుభవిస్తారో..?దోషులందరికీ శిక్ష పడాలి." అంటూ తన ఉద్రేకాన్ని వ్యక్తపరిచాడు. ఈ క్రమంలోనే.. చాలా మంది నెటిజన్లు.. ప్రాణాలు కోల్పోయిన ఆ విద్యార్థులకు కామెంట్ల రూపంలో నివాళులు అర్పించారు.