రైతు భరోసా పథకం కింద తెలంగాణలో రైతులకు ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వానాకాలం సీజన్ నుంచే రైతు భరోసా పంట సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు రూ.10 వేలు పంట సాయం ఇవ్వగా.. రేవంత్ సర్కార్ ఎకరాకు రెండు విడతల్లో రూ. 15 వేలు జమ చేయనుంది. అయితే ఈ పథకం విధివిధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కొత్త మార్గదర్శకాలతో రైతు భరోసా పథకం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రైతుల అభిప్రాయాలను సేకరించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసారు. నేడు తెలంగాణలోని 110 నియోజకవర్గాల్లో రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని క్లస్టర్ల నుంచి అన్నదాతలను రైతువేదికలకు ఆహ్వానించి వారి అభిప్రాయాలు సేకరించేలా చూడాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆయన సూచించారు. అనంతరం వారి ఫీడ్ బ్యాక్ నమోదు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న రైతుబంధు పథకాన్ని తీసేసి దాని స్థానంలో రైతుభరోసా పథకాన్ని అమలు చేయాలన్నారు. ఇక రైతులు, వివిధ వర్గాలవారి అభిప్రాయాలను తీసుకొని వాటి ఆధారంగా రైతుభరోసా పథకం అమలు చేయాలని ఇటీవల కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజాధనం వృథా కాకుండా అర్హులకు మాత్రమే అందేలా చూడాలన్నారు. కేవలం సాగు చేసే భూములకే పంట పెట్టుబడి సాయం అందించాలని అందుకు అనుగుణంగా రైతుభరోసా విధివిధానాలను ఖరారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.