ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థుల కోసం రేవంత్ సర్కార్ సరికొత్త పథకం... ఆ 2 నియోజకవర్గాల్లోనే పైలెట్ ప్రాజెక్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 10:33 PM

తెలంగాణలో సరికొత్త పథకాలతో తనదైన మార్క్ చూపిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పుడు మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు మహిళలు, రైతులు, పేదల కోసం రకరకాల పథకాలు ప్రకటించి ఒక్కొక్కటిగా అమలు చేస్తోన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు విద్యార్థుల కోసం సరికొత్త స్కీం అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. సమీకృత రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే దీనిపై ప్రభుత్వం.. లోతుగా సమీక్ష జరిపింది. గత ప్రభుత్వం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వేరు వేరుగా గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయగా.. ఇప్పుడు వాటన్నింటి ఒకే ప్రాంగణంలోకి తీసుకురావాలన్న సంచలన నిర్ణయం చేస్తోంది.


ఈ నిర్ణయాన్ని అమలు చేయటంలో వచ్చే ఆచరణాత్మక సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు వివిధ శాఖల అధికారులు లోతుగా చర్చించారు. విశాలమైన ప్రాంగణంలో ఒకే చోట ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్వహించడంలో ఉన్న అనుకూలతలు, ప్రతికూలతలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. విద్యార్థులకు అవసరమయ్యే.. తరగతి గదులు, హాస్టళ్లు, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్, సిబ్బందికి క్వార్టర్స్ తదితరాలన్నింటిపై సూదీర్ఘంగా చర్చించారు.


ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం కొత్తగా భవనాలను నిర్మించాల్సి ఉండగా.. అన్నింటినీ ఒకేలా డిజైన్ చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచించారు. ఆ ప్రకారమే అధికారులు కొన్ని డిజైన్లు సిద్ధం చేయగా.. వాటిని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి తదితరులు పరిశీలించారు. ఈ కొత్త పథకానికి పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర అసెంబ్లీ నియోజవర్గాలను ప్రభుత్వం ఎంపిక చేసింది.


మొదట ఆ రెండు నియోజకవర్గాల్లోనే ఈ ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించి ఆ తర్వాత దశలవారీగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్మించాలని సర్కార్ యోచిస్తోంది. కాగా.. ఈ బిల్డింగుల కోసం రెండు నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇప్పటికే.. 20 ఎకరాల చొప్పున స్థలాన్ని కూడా సేకరించటం గమనార్హం. ఆర్కిటెక్టుల నుంచి వచ్చిన డిజైన్లలో ఉత్తమంగా ఉన్నవాటిని ఎంపిక చేసి ఈ 2 నియోజకవర్గాల్లో భవనాలు నిర్మించి.. ఆచరణాత్మక సమస్యలపై స్టడీ చేసిన తర్వాత.. మిగిలిన నియోజకవర్గాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com