హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉన్న ఏపీ మాజీ సీఎం, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేసిన అంశం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన.. జీహెచ్ఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి కాటా.. సంబంధిత అధికారి అయిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పై చర్యలు తీసుకున్నారు. హేమంత్ బోర్కడేను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆమ్రపాలి. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ అధికారికి ప్రమోషన్ వచ్చింది. హేమంత్ బోర్కడేకు.. (తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎండీగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ కావటం గమనార్హం.
నగరంలోని ఆయా ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలపై దృష్టి సారించిన జీహెచ్ఎంసీ అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలను కూల్చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే.. లోటస్ పాండ్లోని వైఎస్ జగన్ నివాసం ముందున్న ఫుట్పాత్ ఆక్రమించి సెక్యూరిటీ పోస్ట్ల నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల ఆధ్వరంలో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు.. జేసీబీలతో సెక్యూరిటీ పోస్టులను పూర్తిగా నేలమట్టం చేశారు.
అయితే.. ఈ నిర్మాణాల కూల్చివేతపై ఉన్నతాధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదన్న ఆగ్రహంతో.. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేపై ఆమ్రపాలి చర్యలకు ఉపక్రమించారు. హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు వేయగా.. జీఐడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి తొలగిస్తూ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. ఆమ్రపాలి సస్పెండ్ చేసిన అధికారికి ప్రస్తుతం ప్రమోషన్ దొరకటంపై సర్వత్రా చర్చనడుస్తోంది. అయితే కూల్చివేత సమయంలో వచ్చిన రాజకీయంగా ఒత్తిడి కారణంగానే అధికారిపై వేటు వేసి చర్చకు పుల్ స్టాప్ పెట్టారని.. అది చల్లారగానే ఇప్పుడు మళ్లీ ప్రమోషన్ ఇచ్చి దిద్దుబాటు చర్యలు చేపట్టారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ దిద్దుబాటు చర్యలు కూడా ఆమ్రపాలి చొరవతోనే జరిగాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.