ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాటేసిన కన్నతండ్రి.. రెండేళ్లుగా 15 ఏళ్ల కూతురు ఒంటరిగా న్యాయ పోరా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 07:35 PM

తనకు ఏ కష్టం వచ్చినా.. తల్లికి కూడా చెప్పకుండా తండ్రికే చెప్పుకుంటుంది కూతురు. తండ్రి అంటే కూతుళ్లకు అంత భరోసా, కొండంత ధైర్యం. కానీ.. మనుషుల రూపంలో ఉన్న కొన్ని మృగాలు.. ఆ బంధానికి ఉన్న కనీస విలువ కాదు కదా.. కనీసం అర్థం కూడా తెలియకుండా.. పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతమున్న పాడు సమాజం నుంచి కూతురికి ఎలాంటి ఆపద రాకుండా కంచెలా ఉండి.. కంటికి రెప్పలా కాచుకోవాల్సిన కన్నతండ్రే కాటేస్తే ఆ కూతురి పరిస్థితి ఎంటీ..? అలాంటి అమానవీయ ఘటనే.. హైదరాబాద్ పాతబస్తీలో రెండేళ్ల క్రితం జరిగింది. కానీ.. ఆ బాధిత అమ్మాయి కుంగిపోలేదు.. కామాంధుడైన తన కన్నతండ్రికి శిక్ష పడేలా.. ఒంటరిగా న్యాయపోరాటానికి దిగింది.


13 ఏళ్ల వయసులో కన్నతండ్రే పాశవికంగా పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే పట్టించుకోలేదు. అలాంటి సమయంలో.. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ కుంగిపోయి ఇంట్లోనే కూర్చోలేదు. కామంతో వావివరసలు మర్చిపోయి మృగంలా మారిన తన తండ్రికి ఎలాగైనా శిక్ష పాడాలని సంకల్పించుకుంది. ఆ మృగం చేస్తున్న అకృత్యాలపై.. ఒంటరిగా పోలీస్ స్టేషన్‌‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. ఈ విషయంలో తన కుటుంబం నుంచి ఆమెకు ఎవరూ సపోర్ట్ చేయకపోవటం శోచనీయం. కుటుంబానికి వ్యతిరేకంగా.. తన తండ్రి చేసిన నికృష్టపు పనికి శిక్ష పడేందుకు రెండేళ్లుగా ఒంటరిగానే ఆ అమ్మాయి పోరాటం చేస్తుండగా.. చివరికి శుక్రవారం (జూన్ 21న) న్యాయస్థానం తీర్పునిచ్చింది.


పోక్సో చట్టం కింద నిందితునిపై నమోదైన కేసులపై ప్రత్యేక న్యాయమూర్తి విచారణ జరిపి.. అతన్ని దోషిగా తేల్చారు. ఆ కామాంధుడికి యావజ్జీవ కారాగారశిక్ష విధించటంతో పాటు అమ్మాయికి రూ.5 లక్షల పరిహారం కూడా చెల్లించాల్సిందిగా కోర్టు తీర్పునిచ్చింది. సొంత కుటుంబానికి దూరంగా ఉండి.. అత్యాచారం చేసిన తన తండ్రిని జైలుకు పంపేందుకు రెండేళ్ల పాటు ఆ చిన్నారి ఒంటరిగా పోరాడిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచింది. డిఫెన్స్ న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న సందర్భంలో.. ఆ అమ్మాయి అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించినట్టుగా లాయర్లు, పోలీసులు చెబుతున్నారు.


అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ రామి రెడ్డి మాట్లాడుతూ.. తన సొంత కుటుంబం ద్వారా లైంగిక వేధింపులు, నిందలు ఎందురైనా.. ధైర్యంగా ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఉన్నప్పటికీ, ఆమె కోర్టులో ప్రశ్నలను ధైర్యంగా ఎదుర్కుందని తెలిపారు. బయటి నుంచి ఒత్తిడి ఎదురైనప్పటికీ.. ఆమె ముందు నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉందని తెలిపారు.


మే 2022లో ఒక రాత్రి.. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి తన తండ్రి చేస్తున్న అకృత్యాలను, ఈ విషయంతో తన కుటుంబం నుంచి ఎలాంటి మద్దుతు రావటం లేదన్న విషయాన్ని ధైర్యంగా చెప్పింది. ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసుకుని.. ఆమెను వైద్యం కోసం భరోసా సెంటర్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. తన తండ్రిపై కేసు పెట్టినప్పటి నుంచి ఆ బాలిక రాష్ట్ర శిశు సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో సురక్షితంగా ఉంటోందని వివరించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com