తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీలోని చాలా మంది చిన్నాపెద్దా నేతలు కాంగ్రెస్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ జంపింగ్ జపాంగ్ ప్రక్రియ ఊపందుకోనుందని తెలుస్తోంది. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇక మిగిలేది కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమేనని కాంగ్రెస్ నేతలు పదే పదే స్టేట్ మెంట్లు ఇస్తుండటం.. ఈ క్రమంలోనే.. గులాబీ బాస్కు అత్యంత సన్నిహితుడైన మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కాగా.. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావటంపై అటు బీఆర్ఎస్ శ్రేణులే కాకుండా.. ఇటు హస్తం పార్టీ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. పోచారం చేరికపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అవకాశవాదానికి నిదర్శనంగా భావిస్తున్నా అంటూ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటివి తాను ప్రోత్సహించనన్నారు.
ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని జీవన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 65 మంది ఎమ్మెల్యేలతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని.. వేరే పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించటం లేదని చెప్పుకొచ్చారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంపై.. సొంత పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే అభ్యంతరం వ్యక్తం చేయటంపై పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో.. మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతారని చెప్పటం ఇప్పుడు మరింత చర్చకు తెరలేపింది.