సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పేట్రేగిపోతున్నారు. అవకాశం ఉన్న ఏ మార్గాన్ని వదలకుండా.. సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకోసం.. కేవలం అమాయకులైన సామాన్య ప్రజలను మాత్రమే టార్గెట్ చేయకుండా.. ఈ మధ్య వాళ్లు కూడా రూట్ మార్చారు. సమాజంలో పేరు మోసిన ప్రముఖులు సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తూ.. వారి పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారు. వారి అకౌంట్లను హ్యాక్ చేసి.. వారి కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి మెస్సేజులు పంపుతూ.. డబ్బలు దండుకుంటున్నారు. మొన్నటివరకు ఐఏఎస్, ఏపీఎస్ల సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. ఇప్పుడు ప్రజాప్రతినిధుల అకౌంట్లపై పడ్డారు. ఈ క్రమలోనే.. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ట్విట్టర్ అకౌంట్ను సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. వేముల వీరేశం ట్విట్టర్ ప్రొఫైల్ మొత్తం చైనీస్ బాషలో కనిపిస్తుండటం గమనార్హం. బయోలో కూడా చైనీస్ లింకులే దర్శనమిస్తున్నాయి. అసలు ఈ లింకులెంటీ అని సెర్చే చేస్తే.. అవన్నీ చైనాకు సంబంధించిన ఫేక్ బెట్టింగ్ సంస్థలకు సంబంధించినవిగా తెలుస్తోంది. ఫ్రొఫైల్లో ఉంది కూడా ఆ బెట్టింగ్ సంస్థకు సంబంధించిన పేర్లుగానే తెలుస్తోంది. దీంతో.. ఎమ్మెల్యే అకౌంట్ను హ్యాక్ చేసింది.. చైనాకు చెందిన బెట్టింగ్ ముఠాగా అనుమానిస్తున్నారు.
అయితే.. 2015లో వేముల వీరేశం తన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. కాగా.. చివరిగా 2023 డిసెంబర్ 17 వరకు మాత్రమే అకౌంట్ యాక్టీవ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత ఆ ఖాతాలో ఎలాంటి పోస్టులు కనిపించకపోవటం గమనార్హం. అయితే.. ఈ ట్విట్టర్ ఖాతా హ్యాక్ విషయంపై ఎమ్మెల్యే వేముల వీరేశం ఇప్పటి వరకు స్పందించకపోవటం గమనార్హం. దీంతో.. అసలు ఈ ఖాతా ఆయన వాడేదేనా.. లేదా ఎవరైనా ఆయన పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ.. వేముల వీరేశం ట్విట్టర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం నేరుగా ఈ ఖాతాకే తీసుకెళ్తుండటం గమనార్హం. మరి దీనిపై పోలీసులు ఏమైనా దృష్టి పెడతారా.. లేదా ఆయన కంప్లైంట్ ఇవ్వలేదని వదిలేస్తారా అన్నది వేచి చూడాలి.