ప్రపంచం టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతోంది. కూర్చుకున్న దగ్గరి నుంచే విశ్వం మొత్తాన్ని వీక్షించేంత విజ్ఞానం పెరిగిపోయింది. చంద్రునిపైనే కాదు.. సూర్యుని మీద కూడా ప్రయోగాలు చేసే స్థాయికి ఎదిగిపోయాం. చరిత్రలో మనకంటూ ఓ పేజీ ఉండేందుకు కొంతమంది కృషి చేస్తుంటే.. మరి కొంతమంది మనుషులు మాత్రం.. పక్కనోడి వినాశనం కోరుకుంటూ.. ఉన్నచోటే ఆగిపోతున్నారు. అందులోనూ.. ఈకాలంలో కూడా మూడనమ్మకాలు, క్షుద్రపూజలంటూ.. వెర్రిగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనే ములుగు జిల్లాలోని మంగపేట మండలంలోని చెరుపల్లిలో చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన అచ్చ లక్ష్మీనర్సయ్య తిరుమల దంపతులు.. ఏప్రిల్ 6న ఏటూరునాగారం మండల కేంద్రంలో నూతన గృహం నిర్మించుకొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు. కాగా.. వారంటే గిట్టని వారు ఎవరో.. వారి నూతన గృహాప్రవేశానికి పంచిన ఆహ్వానం కార్డుతోనే.. క్షుద్రపూజలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది.
శనివారం (జూన్ 22న) రాత్రి లక్ష్మీనర్సయ్య పంచిన గృహప్రవేశం ఆహ్వానం కార్డును.. గ్రామంలోని మూడు కూడళ్లలో పెట్టి.. దానితో పాటు నల్ల కోడి, కోడిగుడ్డు, బూడిద గుమ్మడి, మిరపకాయలు, బొమ్మలు, పసుపు, కుంకుమ లాంటి రకరకాల వస్తువులు పెట్టి క్షుద్రపూజలు చేసినట్టుగా స్థానికులు గుర్తించారు. ఇది చూసిన గ్రామస్తులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహప్రవేశ ఆహ్వానం పత్రిక పెట్టి క్షుద్రపూజలు చేయడం ఏంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.