ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా తయారయ్యారేంట్రా! మద్యం మత్తులో మందుబాబు అరాచకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 07:23 PM

వైఎస్ఆర్ జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. పీకలదాకా మందు తాగి.. ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నదీ తెలీకుండా ప్రవర్తించాడు. ఫుల్లుగా మందు తాగిన ఓ వ్యక్తి.. ఏకంగా బస్సుపైన ఎక్కి పడుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. రాయచోటి డిపోకు చెందిన ఓ ఆర్టీసీ బస్సు.. వేంపల్లి నుంచి రాయచోటికి వెళ్తోంది. అయితే మార్గమధ్యలో చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లి వద్ద ఆగింది. దిగేవాళ్లు దిగారు.. ఎక్కేవాళ్లు ఎక్కారు. అయితే ఇదే సమయంలో ఓ మందుబాబు బస్సులోకి వెళ్లకుండా.. బస్సు టాప్ పైకి ఎక్కాడు. వెనుక నుంచి నిచ్చెన ద్వారా బస్సుపైకి ఎక్కి పడుకున్నాడు. అయితే ఈ సంగతేమీ తెలియని బస్సు డ్రైవర్.. బస్సును ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేశాడు.


అయితే ఈలోపే చుట్టుపక్కల ఉన్న జనం ఈ సంగతి గమనించారు. గట్టిగా కేకలు వేశారు. బస్సు కండక్టర్‌కు విషయం చేరవేశారు. కండక్టర్ అప్రమత్తం చేయడంతో బస్సు డ్రైవర్ బస్సును ఆపాడు. ఆ తర్వాత కండక్టర్, బస్సు డ్రైవర్ మన మందుబాబును కిందకు దింపారు. అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అక్కడి జనం అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మద్యం మత్తులో ఏకంగా బస్సుపైకి ఎక్కి పడుకోవటం నవ్వు తెప్పించింది. ఈ వీడియోను అక్కడున్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నెటిజనం ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.


మరోవైపు అన్నమయ్య జిల్లాలోనూ ఓ ఆగంతకుడు రెచ్చిపోయాడు. అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించి హల్ చల్ చేశాడు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లిలోని ముత్తు మారెమ్మ గుడిలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించి కత్తితో హల్ చల్ చేశాడు. కత్తి చూపిస్తూ స్థానికులను బెదిరించడమే కాకుండా అమ్మవారి విగ్రహం ఎదురుగా కూర్చుని పిచ్చి చేష్టలు చేశాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్ఖలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆగంతకుడు రాజస్థాన్‌కు చెందిన రాజేష్‌గా గుర్తించారు. నిందితుడు రైల్వే పోలీసుల నుంచి తప్పించుకుని గర్భగుడిలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com