తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ కోసం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రూ.2 లక్షల లోపు రైతు రుణాలను ఏక కాలంలో మాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం నిధుల సమీకరణకు రేవంత్ సర్కారు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్న ప్రభుత్వం.. రూ.10 వేల కోట్ల మేర రుణాలు సేకరించేందుకు ఆర్బీఐ అనుమతి కోరింది. మిగతా మొత్తాన్ని వివిధ మార్గాల్లో సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం బిజీగా ఉంది.
అయితే రుణమాఫీకి భారీ మొత్తం నిధులు అవసరం అవుతుండటం.. రైతు భరోసా నూతన మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉండటంతో.. ఈసారి ఖరీఫ్ సీజన్లో రైతు భరోసా (గతంలో రైతు బంధు) నిధులను సకాలంలో అన్నదాతల బ్యాంకు అకౌంట్లలో జమ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటి దాకా ఏటా జూలై కల్లా ప్రభుత్వం రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేస్తోంది. అయితే ఈసారి రుణమాఫీ తర్వాతే రైతు భరోసాపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు రైతు భరోసాపై విధివిధానాలు ఖరారు చేసి, నూతన మార్గదర్శకాలు జారీ చేసిన తర్వాతే.. నిధులను రైతుల ఖాతాల్లో వేసే ఛాన్స్ ఉందని సమాచారం.
ఎకరానికి రూ.10 వేల సాయం..
కేసీఆర్ హయాంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎకరానికి రూ.4 వేల చొప్పున ఏడాదికి రెండు విడతలుగా సాయం అందించారు. ఆ తర్వాత ఆ సాయాన్ని ఎకరానికి ఒక విడతకు రూ.5 వేలకు పెంచారు. ఎకరం భూమి ఉన్న రైతుకు ప్రభుత్వం ఏటా రూ.10 వేలు సాయం చేస్తోంది. అయితే భూ గరిష్ట పరిమితి లేకుండా కేసీఆర్ హయాంలో రైతు బంధును అందించారు. దీని వల్ల వ్యవసాయం చేయని వారికి, పెద్ద విస్తీర్ణంలో సాగు భూమి ఉన్న వారికే ఎక్కువ లబ్ధి కలుగుతోందని విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో రైతు భరోసా మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జూలై 15లోగా ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిపిన తర్వాత నూతన మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. నూతన మార్గదర్శకాలను రూపొందించి.. వాటి ఆధారంగా లబ్ధిదారుల కొత్త జాబితాను తయారు చేయడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు.
వారికి మాత్రమే రైతు భరోసా..?
పేద రైతులకు మాత్రమే ఆర్థిక సాయం అందించడం కోసం.. రైతు భరోసాకు పరిమితులు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. 5 ఎకరాల్లోపు భూమి ఉన్న వారికే రైతు భరోసా ఇవ్వడంతోపాటు.. ఆదాయపన్ను కట్టేవారిని రైతు భరోసా నుంచి మినహాయించే యోచనలో ఉందని సమాచారం.