ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 08:00 PM

యూజీసీ నెట్ పేపర్ లీక్ సహా నీట్‌లో అవకతవకలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ పరీక్షలను నిర్వహించే ఎన్టీఏ రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తిరుకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌యూఐ సహా విద్యార్ధి సంఘాలు నీట్‌ అంశంపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోరగా అందుకు ఆయన నిరాకరించారు. దీంతో విద్యార్ధి సంఘాల నేతలు ఆయన నివాసాన్ని శనివారం ఉదయం ముట్టడించారు. యువజన కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ ఆధ్వరంలో భారీగా విద్యార్థులు, కాంగ్రెస్ కార్యకర్తలు కిషన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు.


నలకుంట పోలీస్ స్టేషన్‌లో బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించి, విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని ఫిర్యాదు చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరామని చెప్పారు. ఆయన అందుకు నిరాకరించడంతో ఐక్య యువజన ,విద్యార్థి సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశామన్నారు.


కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. ఇప్పటికైన విద్యార్థుల పక్షాన వారి డిమాండ్‌లను మోదీ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నామని వ్యాఖ్యానించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, NTAను రద్దు చేసి పేపర్ లీకేజీ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. నీట్‌కు హాజరైన 24 లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు కేంద్రం క్షమాపణలు చెప్పాల్సిందేనని ఎమ్మెల్సీ అన్నారు.


తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన 60 వేల మందికిపైగా విద్యార్థులతో పాటు దేశ వ్యాప్తంగా రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుందని బల్మూరి వెంకట్ ఉద్ఘాటించారు. అటు, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ అరవింద్ నివాసం ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీ అరవింద్ నివాసాన్ని ఎన్ఎస్ యూఐ సహా వామపక్ష విద్యార్థి నాయకులు ముట్టడించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోగా.. తోపులాట చోటుచేసుకుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com