ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ. 4 కోట్ల విలువైన లగ్జరీ కారుకు నిప్పు పెట్టేశారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 08:38 PM

కారు కొంటామని నమ్మించి లగ్జరీ కారుకు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగికి చెందిన నీరజ్‌ అనే వ్యాపారి తన లంబోర్ఘిని స్పోర్ట్స్ కారు అమ్మాలని నిర్ణయించుకొని పరిచయస్తుడైన అయాన్‌కు విషయం చెప్పాడు. కస్టమర్‌ ఉంటే చూడాలంటూ అయాన్‌ తన స్నేహితుడైన మొఘల్‌పురాకు చెందిన అమన్‌ హైదర్‌కు సూచించాడు. ఈ క్రమంలో కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందంటూ అమన్‌కు అతని స్నేహితుడు అహ్మద్‌ తెలిపాడు.


శనివారం సాయంత్రం 4 గంటలకు మామిడిపల్లిలోని ఫామ్‌హౌస్‌ వద్దకు కారు తీసుకురావాలని అహ్మద్‌ చెప్పడంతో, అయాన్‌ కారు తీసుకొచ్చి జల్‌పల్లి వద్ద అమన్‌కు ఇచ్చాడు. జల్‌పల్లి నుంచి అమన్‌ తన స్నేహితుడు హందాన్‌తో కలిసి కారు నడుపుకుంటూ అహ్మద్‌ చెప్పిన మామిడిపల్లి వివేకానంద చౌరస్తాను దాటి ఎయిర్‌పోర్ట్‌ రోడ్డు వైపు డైవర్షన్ తీసుకొని కారును ఆపారు. అనంతరం అహ్మద్‌.. అతనితో పాటు మరికొంత మంది స్నేహితులు అక్కడికి చేరుకున్నారు. నీరజ్‌ ఎక్కడ..? అతడు మాకు డబ్బులు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరజ్‌ను పిలిపిస్తామని చెప్పినా వినకుండా అహ్మద్‌.. అతని వెంట వచ్చిన స్నేహితులు కారుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు.


ఈ ఘటనలో క్షణాల్లో మంటలు వ్యాపించి కారు పూర్తిగా కాలిబూడిదైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని కారును పరిశీలించారు. అమన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తగలబడిన కారు విలువ రూ. 4 కోట్లు ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com