హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నేటి నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో నగరంలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు నగర వ్యాప్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. అయితే హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది. ఖైరతాబాద్ వినాయకుడు. నగరంలో ఎత్తైన విగ్రహంగా ఖైరతాబాద్ వినాయకుడు ప్రసిద్ధి. ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షల మంది భక్తులు నగరానికి వస్తారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పా్ట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ పరిసరాల్లో 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతాయిని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
రాజ్ దూత్ లైన్ నుంచి - గణేష్ టైపు రోడ్డులో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు. రాజ్ దూత్ లేన్ వద్ద ఇక్బాల్ మినార్ వైపు వాహనాలను మళ్లిస్తారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి మింట్ కాంపౌండ్ వెళ్లే సాధారణ ట్రాఫిక్కు అనుమతి లేదు. అటు వైపు వెళ్లే వాహనాలను రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిరంకారి జంక్షన్ వైపు డైవర్ట్ చేస్తారు. మింట్ కాంపౌండ్ నుండి ఐమాక్స్ థియేటర్ వైపు సాధారణ ట్రాఫిక్ అనుమతి లేదు. అటుగా వెళ్లే వాహనాలు మింట్ శ్రీ కాంపౌండ్ వద్ద తెలుగు తల్లి జంక్షన్ వైపు డైవర్ట్ చేస్తారు. వాహనదారులు ఈ టాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని కొనసాగించాలని పోలీసులు సూచించారు. ఈ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెబుతున్నారు.