తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నేటి నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణో్గ్రతలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆదివారం చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంది. నల్గొండలో సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికంగా 36 డిగ్రీల సెల్సియస్, ఖమ్మంలో 2.2 డిగ్రీలు అధికంగా 34.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 29.8 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
భారత వాతావరణ విభాగం అంచనా ప్రకారం ఈ వేడి వాతావరణం సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుందని చెప్పారు. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉందన్నారు. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకొంటుందని.. మరో నాలుగు రోజుల పాటు అదే వాతావరణం ఉంటుందని చెప్పారు. రానున్న నాలుగు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 21 నుండి 28 వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలు అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కొనసాగవచ్చునని చెప్పారు. ఇదిలా ఉండగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 6 -12 మధ్య ఉపసంహరించుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.